ఊరూరా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అన్ని జిల్లా కేంద్రాల్లో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం కొవిడ్ నిబంధనల నడుమ ఘనంగా జరిగింది. హనుమకొండలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, వరంగల్లో బీ గోపి, మహబూబాబాద్లో శశాంక, జనగామలో శివలింగయ్య, ములుగులో కృష్ణ ఆదిత్య, భూపాలపల్లిలో భవేష్ మిశ్రా జాతీయ పతాకాలను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లలో కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వశాఖల పనితీరు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై జిల్లా అధికారులతో మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుల జీవిత చరిత్రలను వివరించారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ ప్రగతి పథంలో ముందుకుపోతున్నదని చెప్పారు. పలుచోట్ల ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి అధికారులు ఆయాచోట్ల జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.