బచ్చన్నపేట, డిసెంబర్ 28 : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమంలో చేపట్టే పనులు నాణ్యతాప్రమాణాలతో చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సూచించారు. బుధవారం పైలట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలోని కొడవటూరులోని ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన పనులను ఆయన అదనపు కలెక్టర్ ప్రపుల్దేశాయ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై ప్రశ్నించారు. పని చేయని ఫ్యాన్లను తొలగించి కొత్తవి బిగించాలన్నారు. కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాల ఆవరణలో గ్రీనరీ, పవర్ ప్లాంటేషన్, గేటు, నేమ్బోర్డు తదితర పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం కిచెన్షెడ్, అంగన్వాడీ కేంద్రాలను ఆయన సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న ఆహారం, విద్యాబోధన, క్లాస్రూముల్లో వసతులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ అంగన్వాడీ టీచర్కు సూచించారు. ఆయన వెంట డీఈవో రాము, ఈఈ మంగీలాల్, ఎంపీడీవో రఘురామకృష్ణ, ఏఈ హన్మంతు, హెచ్ఎం అరుణ, ఉన్నత పాఠశాల హెచ్ఎం రాము, ఇన్చార్జి ఏపీవో జగదీశ్, పంచాయతీ కార్యదర్శి భరత్కిశోర్, టీఏ స్వామి, అంగన్వాడీ టీచర్లు ప్రేమలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.