హనుమకొండ, మార్చి 17 : పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వరంగల్ పార్లమెంట్కు సంబంధించి జిల్లాలో రెండు నియోజకవర్గాలు (వరంగల్ పశ్చిమ, పరకాల) ఉన్నాయన్నారు. ఎన్నికల నిర్వహణకు నలుగురు ఏఆర్వోలను నియమించినట్లు తెలిపారు. మొత్తం 483 పోలింగ్ స్టేషన్లు ఉండగా, పరకాల నియోజకవర్గంలో 239, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 244 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నా రు. మొత్తం ఓటర్లు 5,04,064 ఉండగా, పరకాల నియోజకవర్గంలో 2,22, 266 మంది, పశ్చిమ నియోజకవర్గంలో 2,81,798 మంది ఉన్నారని తెలిపారు.
ఓటరు జాబితాలో చేరేందుకు నామినేషన్లు వేసే చివరి రోజు వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశా రు. ఈ సారి 85 సంవత్సరాలు దాటిన వారికే హోం ఓటింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. రూ.50వేలలోపు నగదు దొరికితే వాటికి సంబంధించిన సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటే వదిలేస్తారని, రూ.10 లక్షలకు పైగా పట్టుబడితే ఆదాయ పన్నుశాఖకు అప్పగిస్తామన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయంలో తగిన ఆధారాలతో వచ్చి కలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఫిర్యాదుల కోసం 1800 425 1816, 1800 425 1126, 1950 టోల్ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సారి ప్రతి పోలింగ్ కేంద్రంలో వందశాతం వెబ్కాస్టింగ్ చేస్తామన్నారు.
స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చన్నారు. సువిధ యాప్ ద్వారా సభలు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ వివరించారు. సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే మూడు కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని, మరో 10 కంపెనీల కేంద్ర బలగాలు రావాల్సి ఉందన్నారు. కేంద్ర బలగాలతో సమస్యాత్మక ప్రాంతాలలో రూట్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధికాగుప్తా, వెంకట్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్వో వైవీ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ పార్టీల బాధ్యులు తమ బూత్ స్థాయి ఏజెంట్ల వివరాలను సమర్పించాలన్నారు. ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలు పార్టీల పోస్టర్లు, పాంప్లెట్స్పై ప్రెస్ పేరు, సెల్ఫోన్ నంబర్ వివరాలను తప్పక అచ్చువేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారానికి అనుమతి లేదన్నారు. ప్రభుత్వ అధికారుల నివాసాల గోడలపై ఎలాంటి రాజకీయ పోస్టర్లు, కరపత్రాలను అంటించొద్దని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాసరావు, శ్యాంసుందర్, రజినీకాంత్, నేహాల్, లక్ష్మణ్, శ్రీనివాస్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతి సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
వరంగల్, మార్చి 17 : సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లను బల్దియా సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ సంస్థల గోడలపై రాసిన రాజకీయ పార్టీల రాతలను చెరిపేస్తున్నారు. గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశాల మేరకు టౌన్ప్లానింగ్ అధికారి బషీర్ ఆధ్వర్యంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగింంచారు. గోడలపై రాతలను తుడిచి వేస్తున్నారు.