న్యూఢిల్లీ, జూలై 28: భూమిపై ‘కృత్రిమ సూర్యుడి’ని సృష్టించటంలో చైనా కీలక ముందడుగు వేసింది. ‘ఆర్టిఫీషియల్ సన్’ ప్రాజెక్ట్కు సంబంధించి భారీ సూపర్ కండక్టింగ్ అయస్కాంతాన్ని చైనా శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. స్వచ్ఛమైన, అపరిమితమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయటంలో కీలకమైన విజయంగా నిపుణులు పేర్కొంటున్నారు. 2030 నాటికి కేంద్రక సంలీనం (న్యూక్లియర్ ఫ్యుజన్) ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలనేది చైనా శాస్త్రవేత్తల లక్ష్యం. సూర్యగోళం నుంచి నిరంతరం శక్తి విడుదలకు కారణం అక్కడ హైడ్రోజన్ పరమాణువులు ఒకదాని కొకటి ఢీకొని విపరీతమైన శక్తి, ఉష్ణోగ్రతను విడుదల చేయటమే. దీనిని కేంద్రక సంలీనం (న్యూక్లియర్ ఫ్యుజన్)గా పేర్కొంటారు. ఈ ప్రక్రియను భూమిపై కృత్రిమ పరిస్థితిలో చేపట్టడంలో కీలకమైన ఇంజినీరింగ్ విజయాన్ని చైనా అందుకుందని నిపుణులు చెబుతున్నారు.
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ‘డీ’ ఆకారంలో ఉండే భారీ సూపర్ కండక్టింగ్ అయస్కాంతాన్ని తయారుచేశారు. సుమారు 582 టన్నులు బరువుండే భారీ అయస్కాంతం..కేంద్రక సంలీనం తర్వాత వెలుబడే 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉండే ప్లాస్మాను నియంత్రిస్తుంది. శక్తివంతమైన అణు రియాక్టర్ గోడలను ప్లాస్మా తాకకుండా భారీ అయస్కాంతం కాపాడుతుంది. సూర్యగోళంలో నిత్యం జరిగే కేంద్రక సంలీన చర్యలకు ఇది నమూనా. ఈ ప్రాజెక్ట్లో అత్యంత కీలకమైన ‘హై టెంపరేచర్ సూపర్ కండక్టింగ్ సెంట్రల్ సోలనోయిడ్ కాయిల్స్’ను తాజగా పరీక్షించారు. అయితే ఈ ప్రాజెక్ట్లో ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.