పరకాల, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ పార్టీ నాయకులవి మోసపూరిత హామీలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గృహలక్ష్మీ పథకం లబ్ధిదారులకు శుక్రవారం ఆయన కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహలక్ష్మీ పథకంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మొదటి విడుతగా మూడు వేల ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. విడుతల వారీగా అర్హులందరికీ అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రజల కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్ను ఆదరించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కేసీఆర్ మరో పది కాలాలపాటు ముఖ్యమంత్రిగా ఉంటేనే అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమైనట్లో తెలపాలన్నారు. సంక్షేమంలో మన రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుంటే.. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం తెలంగాణ రాష్ర్టానికి, ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని, ఇక గ్యారెంటీ పథకాలతో ప్రజలను మభ్యపెట్టాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ స్కామ్ల పార్టీ అని, వారు తెలంగాణ రాష్ర్టాన్ని దోచుకునేందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
గృహలక్ష్మీ పథకంలో లబ్ధిదారుల ఎంపిక జిల్లావ్యాప్తంగా పారదర్శకంగా చేపట్టామని హనుమకొండ కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. విడుతల వారీగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, ఇల్లు కట్టుకునే లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, గృహలక్ష్మీ పథకం అమలు అధికారి రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ నిప్పాని హైమావతి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజపపాల్రెడ్డి, పరకాల, నడికూడ మండలాల జడ్పీటీసీలు సిలివేరు మొగిలి, కోడెపాక సుమలత, ఎంపీపీలు తక్కళ్లపల్లి స్వర్ణలత, మచ్చ అనసూర్య, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
పేదలందరికీ సొంతింటి నిర్మాణం
గీసుగొండ: రాష్ట్రంలోని పేదలందరి సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గృహలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని 21 గ్రామాల్లో గృహలక్ష్మీ పథకంలో ఇండ్లు మంజూరైన 432 మంది లబ్ధిదారులకు మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం చల్లా మాట్లాడుతూ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసేందుకు గ్యారెంటీ హామీలు ఇస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఏనాడో నమ్మకం పోయిందన్నారు. కర్ణాటకలో సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. అదే తరహాలో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదన్నారు. పదేండ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని కోరారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం
కాంగ్రెస్ పార్టీ నాడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పథకం తీసుకురాగా, పేదలెవరూ ఇండ్లు కట్టుకోలేదని, పైరవీకారులే ఆ ఇండ్ల డబ్బులను పంచుకున్నది వాస్తవం కాదా అని చల్లా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పార్టీలకతీతంగా పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి పైరవీలు లేకుండా ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దళితబంధు లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. 3 గంటల విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కావాలా.. మూడు పంటలకు 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్ సర్కారు కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. బీజేపీ నాయకులు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నాయకులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం స్వచ్ఛతా సేవా ప్రతిజ్ఞ చేశారు. పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.
జిల్లాకు 9,750 ఇండ్లు..
వరంగల్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుతలో 9750 ఇండ్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్య తెలిపారు. జిల్లాలో మొదటిసారిగా గీసుగొండలో మండలంలోని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు తప్పకుండా ఇండ్లు నిర్మించుకోవాలని కోరారు. మూడు దఫాల్లో లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తామన్నారు. ఈ నెల 30లోగా మొదటి బిల్లు చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్రావు, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ భీమగాని సౌజన్య, వైస్ ఎంపీపీ రడం శ్రావ్యా భరత్, తహసీల్దార్ రీయాజుద్దీన్, ఎంపీడీవో వీరేశం, ఎంపీటీసీ వీరారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, సర్పంచ్లు జైపాల్రెడ్డి, జ్యోతి, అశ్విని, వీరాటి కవిత, వాంకుడోత్ రజిత, నాగేశ్వర్రావు, సరోజన, బోడకుంట్ల ప్రకాశ్, గోనె మల్లారెడ్డి, ఆర్.రజిత, ఎం.నాగదేవత, ఆంగోత్ కవిత, రమ, బాబు, రాధాబాయి, గోపి, అనిల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ వీరాటి లింగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, సొసైటీ చైర్మన్లు శ్రీధర్, వీరస్వామి, శ్రీనివాస్రెడ్డి, నాయకులు మంత రాజయ్య, రవీందర్రెడ్డి, ధనుంజయ్, గడ్డమీది కుమారస్వామి, కూరపాటి వీరస్వామి, స్వామి, జీ రాజు, సుంకరి శివకుమార్, బాబురావు పాల్గొన్నారు.