ఖిలావరంగల్: లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడే స్ఫూర్తి అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించారని తెలిపారు.
గంగను దివి నుంచి భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని అన్నారు. ఆయన్ను స్మరించు కోవడం, జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. మహనీయుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా బిసి సంక్షేమ అధికారి పుష్పలత, జిల్లా అధికారులు బిసి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.