వరంగల్, ఆగస్టు 3(నమస్తేతెలంగాణ): ‘భారీ వర్షాలతో జిల్లాలో దెబ్బతిన్న రహదారులు, కాజ్వేలు, కల్వర్టులకు యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేశాం. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్తు, తాగునీటి సరఫరాను పునరుద్దరించాం. అంటువ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్తలు చేపట్టాం. అవసరమైన చోట వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. పారిశుద్ధ్యంపై పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. చెరువులు, కుంటలకు బుంగలు పడిన చోట ఇరిగేషన్ ఇంజినీర్లు మరమ్మత పనులు చేపట్టారు’ అని కలెక్టర్ పి ప్రావీణ్య చెప్పారు. కొన్ని రోజుల క్రితం వర్షం జిల్లాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆమె ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడారు. వర్షాలపై అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం చేసిందని చెప్పారు. అన్ని శాఖ ల అధికారులు అలర్ట్గా ఉన్నారన్నారు. ఱూతస్థాయిలో ఎప్పటికప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టారని ఆమె పేర్కొన్నారు. అతి భారీ వర్షాలకు కొన్ని కాలనీల్లో వరద నీరు చేరడంతో నీటిలో చిక్కుకున్న ప్రజలను ప్రభుత్వ అధికారులు, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రదేశాలకు తరలించారని వివరించారు. 723 మందిని రక్షించి 15 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
బట్టలబజార్, చింతల్, శివనగర్, బీఆర్నగర్, సాకరాశికుంట, శివనగర్, ఎస్ఆర్ఆర్ తోట, మామునూరు, నాయుడుపెట్రోల్ బంకు, కాశికుంట, ఉర్సుగుట్ట, ఎస్ఆర్నగర్, గరీబ్నగర్, డాక్టర్స్కాలనీ, వరంగల్లో ఏర్పాటు చేశామన్నారు. నర్సంపేటలోని ఎన్టీఆర్ నగర్, నెక్కొండలోని మంగలితండా, బంజరపల్లి, చంద్రుగొండ, దుగ్గొండి మండలంలోని అడవిరంగాపురం, పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, వర్దన్నపేట మండలంలోని ఇల్లందలో ఒక్కో పునరావస కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 22 పునరావస కేంద్రాల్లో 2,888 మంది ఆవాసం పొందారని ప్రావీణ్య వెల్లడించారు. ఈ కేంద్రాల వద్దే మెడికల్ క్యాంపులను నిర్వహించామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు చేపట్టారని తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ, పట్టణాల్లో మున్సిపల్శాఖ అధికారులు, సిబ్బంది పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నారి చెప్పారు.
తాత్కాలిక మరమ్మతులు
జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న 192 గ్రామాల్లో వర్ష ప్రభావం కనపడింది. జిల్లావ్యాప్తంగా 22.60కిమీ ఆర్అండ్బీ, 119.15కిమీ పంచాయతీరాజ్, 10.83 కి.మీ మున్సిపల్ రోడ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్ తెలిపారు. వరంగల్లో 24.02కి.మీ మేర నాలా పాక్షికం గా దెబ్బతిన్నదని చెప్పారు. 427 విద్యుత్ స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వరద నష్టాలపై ఆయా శాఖల అధికారులు తాత్కాలిక, శాశ్వత మరమ్మతులకు అంచనాలు వేశారన్నారు. ఎన్పీడీసీఎల్ అధికారులు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారని చెప్పారు. 383 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా బాధితుల కు ప్రభుత్వం తరఫున రూ.12,25,600 పరిహారం అందజేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. కొన్ని చెరువులు, కుంటలు, కాల్వలకు బుంగలు పడగా వీటన్నింటికీ రూ.39.41 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టామన్నారు. శాశ్వత మరమ్మతులకు రూ.2.24 కోట్ల అంచనాలు రూపొందించినట్లు ప్రావీణ్య చెప్పా రు. మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన చోట మరమ్మతులు చేపట్టారు. పంట నష్టాలపై వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు సర్వే చేపట్టారని తెలిపారు.