వరంగల్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆదివారం ఆమె వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న రానుందని, ఆ రోజు నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని తెలిపారు.
భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమైనట్లు చెప్పారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గాల్లో తుది ఓటరు జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లు, 977 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. అర్హులందరూ ఓటరు జాబితాలో పేరు సరి చూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు ఏప్రిల్ 15 వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు 1,893 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటరుకు 2కిలోమీటర్ల రేడియస్లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై టోల్ఫ్రీ నంబర్ 1950, కాల్ సెంటర్ నంబర్ 09702530811, సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో నాలుగో విడుతలో పోలింగ్ జరుగనుందని తెలిపారు.
అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో అవసరమైన చెక్పోస్టులను ఏర్పాటు చేశామని, 24గంటల పాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించి నగదుతో ప్రయాణించొద్దని, రోజూ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సొమ్మును జిల్లాలోని గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి నగదు తీసుకెళ్లవచ్చని చెప్పారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో శ్రీనివాస్, డీపీఆర్వో అయూబ్అలీ, ఆర్డీవోలు పెదం దత్తు, కృష్ణవేణి పాల్గొన్నారు.