హనుమకొండ, ఏప్రిల్ 23 : ఐదేళ్ల లోపు చిన్నారులకు, గర్భిణులు, బాలింతలు పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమాధికారి జె. జయంతి అద్యక్షతన నిర్వహించిన పోషణ పక్షం ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలంటే జిల్లాలోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రణాళికబద్ధంగా లబ్ధిదారులకు అందాల్సిన సేవలు సకాలంలో అందించాలని, లోపపోషణ లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు.
అంగన్వాడీ కేంద్రం ద్వారా అనుబంధ పోషకాహారం, ఆరోగ్యం, పోషకాహార విద్య, ప్రీస్కూల్ విద్య, రోగనిరోధకత, రెఫరల్ సేవలు, ఆరోగ్య పరీక్షలు తదితర సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోషణ పక్వాడ 2025 ఉద్దేశాలకనుగుణంగా మొదటి వంద రోజులపై దృష్టి సారించాలని, గర్భిణి దశ నుండి పుట్టిన బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు1000 రోజులుగా పరిగణించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ బాలిక దినోత్సవం రోజున (జనవరి 24) ఆడ పిల్లలకు జన్మ నిచ్చిన ఐదుగురు చిన్నారులను, తల్లి తండ్రులకు తివాచి పరచి ఘనంగా స్వాగతించి కలెక్టర్ సన్మానించారు. అలాగే చిన్నారులకు అక్షరాభ్యాసం, ఆన్నప్రాసన, గర్భిణిలకు సీమంతం కార్యక్రమాలు చేపట్టారు.
ప్రీస్కూల్ పూర్తిచేసిన చిన్నారులకు కాన్వోకేషన్, సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఆరుగురు లబ్ధిదారులకు పోస్టాఫీసు పాస్ పుస్తకాలను అందచేసారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ ఝాన్సీ లక్ష్మీ బాయి, డీఎంహెచ్వో అప్పయ్య, ఆయుష్ వైద్యులు డాక్టర్ మహేందర్, జిల్లా న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ సరళ, సిడీపీఓలు విశ్వజ, స్వరూప, స్వాతి, పోషణ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ టీ సుమలత, జిల్లా మిషన్ శక్తి కో ఆర్డినేటర్ డి కళ్యాణి, సీనియర్ అసిస్టెంట్ వి.వెంకట్రాం, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, ఐసీపీఎస్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.