ఖిలావరంగల్, మార్చి 9: జిల్లాలో గత అనుభావాలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష కోసం 27 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 15న పరీక్షలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి 6613 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 7392 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. అలాగే, ఈ ఏడాది పదో తరగతి పరీక్షల కోసం జిల్లాలో 56 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. టెన్త్ పరీక్షలు వచ్చే నెల 3వ తేదీన నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. పదో తరగతిలో ఈ ఏడాది బాలురు 5013 మంది, బాలికలు 4715 మంది, ప్రైవేటు అభ్యర్థులు 27 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు.
పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి
గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రంలో ఏఎన్ఎంలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, పరీక్ష కేంద్రంతోపాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు శాఖ బందోబస్తు, పరీక్ష కేంద్రాల రూట్లలో బస్సులు సమయానికి అనుకూలంగా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పరీక్షలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, డీఈవో వాసంతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రయోగాలపై ఆసక్తిని కలిగించాలి
సైన్స్ ప్రయోగాలపై విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కలెక్టర్ గోపి అన్నారు. కలెక్టరేట్లో 38 ప్రభుత్వ పాఠశాలలకు సూర్యకిరణ్ వెల్ఫేర్ సొసైటీ సైన్స్ కిట్లను అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ కిట్లను సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు. ఒక్కో కిట్ విలువ సుమారు రూ. 3 వేలు ఉండగా, ప్రభుత్వ పాఠశాలలకు అందించిన సొసైటీ అధ్యక్షుడు తూడి విద్యాసాగర్రెడ్డిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, రిసోర్స్పర్సన్లు పీ సురేశ్బాబు, ఎస్ సురేశ్ పాల్గొన్నారు.