వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 1 : శాస్త్ర, సాంకేతిక రంగాలపై పట్టు సాధిస్తే బంగారు భవిష్యత్ సాధ్యమని కలెక్టర్ గోపి అన్నారు. గురువారం 27వ డివిజన్ యాకూబ్పురలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సైన్స్ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన శాస్త్రవేత్తలు అందరూ విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ విజ్ఞానంపై మక్కువ పెంచుకున్నవాళ్లేనని పేర్కొన్నారు. ప్రస్తుత్ంల శాస్త్ర, సాంకేతిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, మానవ జీవితంలో యంత్రాల వినియోగం పెరిగిపోయిందన్నారు.
టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని 11 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 18 విభాగాల్లో రూపొందించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల కో ఆర్డినేటర్ డీఎస్ వెంకన్న, హెచ్ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.