కమలాపూర్, ఫిబ్రవరి 26 : తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ-1గా విధులు నిర్వర్తిస్తున్న అశోక్రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చిన ఆర్ఐ డబ్బులు ఇవ్వనిదే పని చేయడనే ఆరోపణలున్నాయి. ఆన్లైన్ పత్రికల్లో విలేకరులుగా పనిచేస్తున్న వారికి నివేశన స్థలాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్లు ‘సంభవం’ పీడీఎఫ్ పత్రిక రిపోర్టర్, కన్నూరుకు చెందిన పెర్క రమాకాంత్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకురావడంతో సదరు ఆర్ఐ ఇదే అదనుగా భావించి ఒక్కొక్కరి వద్ద రూ.10 నుంచి 30వేలు వసూలు చేసినట్లు తెలిపారు. నివేశన స్థలాలు ఎప్పుడు ఇస్తారని అడిగితే దాటవేస్తున్నాడని, ఆరు నెలలుగా ఇబ్బంది పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు.
ధరణిలో తప్పొప్పులను సవరించేందుకు అనేక మంది రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు విమర్శలున్నాయి. భూముల ధరలు పెరగడం, జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండడంతో భూ సమస్యల పరిష్కారం కోసం ఆర్ఐ అడిగినంత ముట్టజెప్పినా, సమస్యను పట్టించుకోకపోయేదని ఆరోపణలున్నాయి. కల్యాణలక్ష్మి చెక్కులు, మట్టి తరలించే ఎక్సకవేటర్ల నిర్వాహకుల నుంచి మాముళ్లు, పెద్ద చెరువులో నీళ్లు ఖాళీ చేయించేందుకు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. కలెక్టర్ ఆర్ఐపై విచారణ జరిపితే మరెన్నో అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.