తిమ్మాపూర్ : తెలంగాణ జాతిపిత కేసీఆర్ వైపు ధర్మం నిలిచిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ( Rasamayi Balkisan) అన్నారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) త్వరలోనే జైలు ( Jail ) కు వెళ్తారని జోస్యం చెప్పారు. వడ్ల కొనుగోళ్ళలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు క్వింటాలకు రెండు కిలోల కమిషన్ ఒప్పందం కుదిరినట్టు ఆరోపించారు.
గురువారం తిమ్మాపూర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్కసుతో వేసిన పీసీ ఘోష్ కమీషన్ సరికాదని, కోర్టు తీర్పు వచ్చినా కాంగ్రెస్ తప్పును ఒప్పుకోవడం లేదని అన్నారు. కేసీఆర్కు భయపడి జగిత్యాల సభ రోజునే కాళేశ్వరంలో సీఎం సభ పెట్టడం ఉదాహారణ అని అన్నారు.
కేసీఆర్కు ఉన్న ప్రజాధరణను చూసి ఓర్వలేకనే సీఎం ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా కాళేశ్వరంలో రెండు పిల్లర్లను మరమ్మతు చేసి నీటిని రైతాంగానికి అందించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ద్వారా వేసవిలో సైతం కేసీఆర్ సాగునీటిని అందించాడని గుర్తు చేశారు. వేసవిలో సైతం ప్రాజెక్టులు నీటితో ఉన్నాయని, ఇప్పుడు ఎల్ఎండీ ఖాళీ అయి ఎండిపోతున్నాయని అన్నారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లికి సీనియర్ నేత జీవన్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. ధాన్యం తూకంలో ఐదు కిలోల తరుగుకు క్యాంపు ఆఫీసు నుండి జీవో జారీ అయిందని, అందులో రెండు కిలోలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు, మూడు కిలోలు మిల్లర్లకు ఇచ్చేలా కమీషన్ మాట్లాడుకున్నారని కవ్వంపల్లిపై రసమయి ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గంప వెంకన్న, మహిపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, అశోక్ రెడ్డి, వంతడ్పుల సంపత్, సంగుపట్ల మల్లేశం, సల్ల మహేందర్, నెల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.