హనుమకొండ, జూలై 13 : కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేని సన్నాసి సీఎం.. ఆయన బెదిరింపులకు భయపడం.. ఖబడ్దార్ రేవంత్రెడ్డీ.. అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామన్నారు. రైతులకు సాగునీరందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్హౌస్ పర్యటన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని 30 నెలలు దాటినా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్హౌస్లపై రేవంత్రెడ్డికి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. 15 ఏండ్లు మీ పాలనలో దేవాదుల ప్రాజెక్టుకు బరాజ్ లేకుండా వరదల సమయంలో పంపింగ్ చేశారు కదా.. ఆ మాత్రం సోయిలేదా అని ప్రశ్నించారు. రైతాంగం కోసం కన్నెపల్లి మోటర్లు నడిపించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అడిగితే అడ్డదిడ్డంగా, దారుణంగా ఆ పార్టీ నాయకులను కోసి ఆ రక్తం పొలం మీద చల్లితే పంట పండుతదని అనడం దుర్మార్గమని, ఏ సీఎం ఇలా మాట్లాడలేదన్నారు. ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో ఫ్రస్టేషన్లో బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో క్రైం రేట్ పెద్ద ఎత్తున పెరిగిందన్నారు. 60 ఏండ్లుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని కాంగ్రెస్ పార్టీ తాగిందని ఆరోపించారు. 1952 ఉద్యమంలో ఏడుగురిని, 1969లో 369 మందిని, ఎన్కౌంటర్ల పేరుతో యువకుల్ని, తెలంగాణ ఉద్యమం సందర్భంగా వెయ్యి మంది తెంగాణ బిడ్డల ప్రాణాలను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇంకా రక్త దాహం తీరడం లేదా, ఇంక ఎంత రక్తం కావాలని ప్రశ్నించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఉపయోగపడే ఒక కొత్త సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. కాళేశ్వరం బాగుచేస్తే కేసీఆర్కు పేరొస్తుందనే రైతులను తప్పదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నీళ్లు వదలాలన్న రిటైర్డ్ ఇంజినీర్లను జైళ్లో పెడతానంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కన్నెపల్లి మోటర్ల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చని ఇరిగేషన్ అధికారులు లేఖ ఇచ్చారని, దమ్ముంటే దానిని ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రెండున్నరేండ్లలో రైతులకు మీరు చేసింది ఏమీ లేదని, ఇప్పటికైనా కళ్లు తెరిచి కన్నెపల్లి, దేవాదుల మోటర్లను వెంటనే ఆన్ చేసి రాష్ర్టాన్ని, రైతులను కరువు బారి నుంచి కాపాడాలని హితవు పలికారు. లేని పక్షంలో ఎండిన పంటలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, బీఆర్ఎస్ నాయకులు నయీమొద్దీన్, పోలపల్లి రామ్మూర్తి, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో హింసను ప్రేరిపించేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిపై డీజీ పీ పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ నాయకులు బాల సుమన్, క్రిశాంక్ లాంటి వాళ్లు మాట్లాడినా, ట్వీట్లు చేసినా అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపించిన పోలీస్ యంత్రాంగం మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎం మాట్లాడితే చర్యలు ఉండవా? కరువుతో రైతాంగం తల్లడిల్లుతుంటే నీళ్లపై కక్ష రాజకీయం ఏంది? రైతుల కోసం పంటలకు నీళ్లు అడిగితే నాయకుల రక్తం చల్లి పండించుకోమంటావా? రేవంత్ రెడ్డి అహంకారం తలకెకి అన్నదాతలను అవమానిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. షాబాద్లో ఆరుగురిని చంపిన సైకోకు రేవంత్ మా ట్లాడే మాటలకు, చేసే పనులకు తేడా లేదు. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే, విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెం ట్ బకాయిలు చెల్లించమంటే వారి రక్తం కూడా కావాలా మీకు? ముఖ్యమంత్రి పిచ్చి కూతలు కూస్తే ప్రజలు తగిన సమయంలో కర్రు వాల్చి వాతపెడతారు. హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్కు కూడా అదే గతి పట్టబోతుంది.