జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ)/ రేగొండ : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని.. రిజర్వేషన్లను కాలరాసే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో మంగళవారం పరకాల, భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి జనజాతర సభ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరై బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ 400 సీట్లు కావాలని కోరుకుంటున్నదని, అదే జరిగితే రిజర్వేషన్లు ఉండవన్నారు. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేసిందని, దళితులను, గిరిజనులను అనేక మందిని ఉన్నత స్థాయికి చేర్చిందన్నారు. 1978లో బీసీ, ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ కల్పించిందని, 52శాతం బీసీ, ఓబీసీలు ఉన్నారని, వారికి 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని అప్పటి రాష్ట్రపతి నియమించిన మండల్ కమిషన్ రికమండ్ చేసిందన్నారు.
1990లో రిజర్వేషన్లను అమలు చేయగా అద్వానీ ఆ కమిషన్కు వ్యతిరేకంగా రథయాత్ర చేసి పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లగా బీసీ జనాభా లెక్కించి రిజర్వేషన్ అమలు చేయాలని పిలుపునిచ్చిందన్నారు. కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు అమ లు చేస్తామని, బీజేపీ వస్తే రిజర్వేషన్లకు మంగళం పాడుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, సరిహద్దు సైన్యాన్ని తెచ్చినా వెనకాడేది లేదని రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీ కారిడార్, ఐఐటీ ఇవ్వలేదని, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని, మామునూరు ఎయిర్పోర్టును అడ్డుకున్నారన్నా రు. ఇవి తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ పెత్తనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. సభలో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.