న్యూశాయంపేట, జనవరి 4 : కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆరేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హనుమకొండ విష్ణు ప్రియ గార్డెన్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ నూతన సంవత్సర పవర్మెన్ డైరీ, క్యాలెండర్ను మంత్రులు జగదీశ్వర్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, టీఎస్ ఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డితో కలిసి బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలని చూస్తోందని, సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు ఒప్పుకునేదిలేదని స్పష్టం చేశారని చెప్పారు. దీంతో కేంద్రం రాష్ట్రంపై కక్షగట్టి కుట్రకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. 2001 నుంచి కేసీఆర్ ఉద్యమం చేయకపోతే ఈ రోజున 24 గంటల విద్యుత్ వచ్చేది కాదని, ప్రైవేటీ కరణకు వ్వతిరేకంగా స్పష్టమైన గళాన్ని వినిపించారని చెప్పారు.
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత కేసీఆర్దేనని, తెలంగాణ రాష్టంలో విద్యుత్ రంగాన్ని చీకట్లోకి నెట్టేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్కు సంపూర్ణ అవగాహన ఉందని, ఉద్యోగుల సమస్యలు యాజమాన్యం, ప్రభుత్వానికి తెలుసన్నారు. గుజరాత్లో విద్యుత్ సంక్షోభం వచ్చిందని, దేశంలో ఉన్న నవ రత్నాల కంపెనీలను ప్రైవేట్పరం చేస్తున్నారన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో స్టార్టర్లు, మోటర్లతో అసెంబ్లీ ఎదుట ధర్నాలు చేశామని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో ఆ పరిస్థితి లేదని చెప్పారు. కరంటు తీగల మీద బట్టలు ఈరోజు ఆంధ్రలో ఆరేసుకుంటున్నారని, విద్యుత్ ఉద్యోగుల సహకారంతో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. 24 గంటల కరంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, విద్యుత్ ఉద్యోగులు సమస్యలను సీఎం కేసీఆర్కు వివరిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రైవేటీకరణ చేయనివ్వరు అని అన్నారు . విద్యుత్ ఉద్యోగులు సీఎం కేసీఆర్కు అం డగా ఉండాలని కోరారు.
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ లేక అనేక పరిశ్రమలు మూత పడ్డాయన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారన్నారు. ఉహించని విధంగా వేతన సవరణ చేశారని, దేశ వ్యాప్తంగా వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అందరం అండగా ఉందామన్నారు. దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూస్తోందని, కేసీఆర్ అధ్యక్షతన భారతదేశానికి 24 గంటల కరంటు అందించాలని అన్నారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు బీ వెంకటేశ్వర్రావు, పీ గణపతి, పీ సంధ్యారాణి, పీ మోహన్రెడ్డి, యూనియన్ అధ్యక్షుడు వీ వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, నాయకులు పాల్గొన్నారు.