ఖానాపురం, మార్చి 26 : ఇటీవల వడగండ్ల వానతో జిల్లాలో అధిక శాతం పంటలు నష్టపోగా, సర్వేను అధికారులు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి, అన్నదాతలకు భరోసా కల్పించారు. దీంతో పరిహారం అందించడమే ధ్యేయంగా వ్యవసాయాధికారులు నేరుగా చేల వద్దకే వెళ్లి పంటలను పరిశీలించి రైతుల వివరాలు సేకరిస్తున్నారు. దీనిలో భా గంగా ఆదివారం ఖానాపురం మండలంలోని మంగళవారిపేటలో ఏఈవో నూకల సంతోష్ మక్కజొన్న, మిర్చి, వరి పంటలను పరిశీలించి నష్టాన్ని నమోదు చేశారు. త్వరలోనే పంటల నష్టం సర్వేను పూర్తి చేస్తామన్నారు. సర్వేలో వ్యవసాయ కార్యాలయ, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: మండలంలోని వివిధ గ్రామాల్లో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఆదివారం పట్టణంలోని ద్వారకపేట శివారు, రామవరం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను అధికారులు సర్వే చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మినుముల రాజు, మండల వ్యవసాయ అధికారి కృష్ణకుమార్, ఏఈవో మెండు అశోక్, వీఆర్ఏలు సునీల్, రాజు, శ్రీను, రామవరం సర్పంచ్ కే రవన్న, వెంకటేశ్వర్లు, రైతులు తదితరులు ఉన్నారు.
నర్సంపేట రూరల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో పంట నష్టం సర్వే వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పారదర్శకంగా నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేకు వచ్చిన వ్యవసాయ అధికారులకు, రెవెన్యూ అధికారులకు రైతులు సహకరించాలన్నారు. సీఎం కేసీఆర్ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులున్నారు.
చెన్నారావుపేట : వర్షానికి దెబ్బతిన్న పంటల నష్ట పరిహారానికి సంబంధించిన సర్వేను అధికారులు, నాయకులు కలిసి త్వరగా పూర్తి చేయాలని మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశాల మేరకు వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల నష్ట పరిహారానికి సంబంధించిన సర్వేను అధికారులు, నాయకులు కలిసి త్వరగా పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా నస్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేల చొప్పున నష్ట పరిహారం రైతులకు వస్తుందని తెలిపారు. గ్రామాల్లో సర్వే చేస్తున్న వ్యవసాయాధికారులకు, ప్రజా ప్రతినిధులు, రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, సర్పంచ్ కుండె మల్లయ్య, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, కృష్ణచైతన్య తదితరుల పాల్గొన్నారు.