గజ్వేల్, నవంబర్ 27: మూడోసారి గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, ప్రతి పక్షపార్టీల నాయకులు ఎన్నికలప్పుడే కనిపిస్తారని తర్వాత గజ్వేల్లో కనిపించరని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్లో సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహించనుండగా సోమవారం గజ్వేల్ పట్టణంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభాస్థలి, హెలిప్యాడ్ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు డిపాజిట్ల కోసమే తాపత్రయపడుతున్నారన్నారు. గజ్వేల్లో చేపట్టిన అభివృద్ధితో 50 ఏండ్లు ముందుకు పోయిందని, ముఖ్యంగా తాగు, సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మించి కూడవెళ్లి, హల్దీప్రాజెక్టులను నిర్మించడంతో ఈ ప్రాంతం సస్యశామలమైందన్నారు. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించి రైతుబంధు, రైతుబీమా అందించిన ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని గుర్తుచేశారు. అన్ని వర్గాల వారు కేసీఆర్ పక్షానే ఉన్నారని, గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని, గొర్రెలు, చేపల పంపిణీ చేసి ఆర్థికంగా ఎదిగే విధంగా చేశారన్నారు. రైతులకు 24గంటల పాటు కరెంట్ ఇచ్చారని పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నారన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారుసులను అమలు చేశారని, గజ్వేల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల, ఎడ్యుకేషన్ హబ్ నిర్మించారన్నారు.
గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి తెలంగాణ వ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో రోడ్లపైకి వచ్చి ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ జీతాల కంటే అధికంగా ఇస్తూ వారిని కాపాడుకుంటున్నామన్నారు. నేడు ఏ గ్రామంలోకి వెళ్లినా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం కరెంట్, తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. గ్రామా ల్లో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామన్నారు. హరితహారంలో విరివిగా మొక్కలు పెంచామన్నారు. ప్రజలు కేసీఆర్తోనే ఉన్నారు కాబట్టే తెలంగాణ సాధించుకున్నామన్నారు. రాష్ట్రంలో 85స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేడు మధ్యాహ్నం రెండు గంటలకు లక్షమందితో సీఎం కేసీఆర్ సభనిర్వహిస్తున్నామని, అందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు కిషన్రెడ్డి, మల్లేశం, హనుమంత్, భూపాల్రెడ్డి, అహ్మద్ పాల్గొన్నారు.
గజ్వేల్/ గజ్వేల్అర్బన్, నవంబర్ 27: గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ మార్గంలోని ఐవోసీ భవనం వెనుక మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం, హెలీప్యాడ్ ప్రదేశాలను సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎన్నికల ఇన్చార్జి పాతూరి సుధాకర్రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీకిషన్రెడ్డి, శ్యామలా మల్లేశం పరిశీలించారు. డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మడుపు భూంరెడ్డి, భూపతిరెడ్డి, నాయకులు దుర్గయ్య, హైదర్పటేల్ ఉన్నారు.
గజ్వేల్, నవంబర్ 27: గజ్వేల్ పట్టణంలో నేడు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ శ్వేత తెలిపారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని కోలా అభిరాం గార్డెన్స్లో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని, సభకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. వాహనాల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను నిలుపుకోవాలన్నారు. బందోబస్తులో అడిషినల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో ఆరు సెక్టార్లుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాస్రావు, ఏసీపీలు రమేశ్, సతీశ్, సురేందర్రెడ్డి, రవీందర్రాజు, ప్రసన్నకుమార్, శ్రీనివాస్, సీఐలు జాన్రెడ్డి, జానకీరామ్, రంగ కృష్ణ, రఘుపతిరెడ్డి, తిరపతి పాల్గొన్నారు.