హనుమకొండ, ఆగస్టు 12 : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో బీసీ వేల్ఫేర్ డీడీ రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన బీసీ కుల వృత్తుల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చీఫ్ విప్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. గత పాలకుల పాలనలో మరుగునపడ్డ కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్, వాటిని బలోపేతం చేసే లక్ష్యంతో బీసీ బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. వృత్తిని నమ్ముకున్న కులాలకు ఆర్థిక సాయం అందించి, వారిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యమన్నారు. గతంలో కేవలం అప్పులు ఇచ్చేవారని, దానికి బ్యాంకుల చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఉచితంగా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 300 మంది బీసీ లబ్ధిదారులకు రూ.3కోట్లు అందజేసినట్లు తెలిపారు. సమైక్య పాలనలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్లలో రూ.5కోట్లు కూడా తేలేని తాను, ఇప్పుడు నియోజక వర్గంలోని ప్రతి డివిజన్కు సుమారు రూ.50 కోట్ల వరకు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
బీసీ బంధు గొప్ప పథకం
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 14 బీసీ కుల వృత్తుల వారి కోసం అమలు చేస్తున్న బీసీ బంధు పథకం గొప్పదన్నారు. ఎక్కడికీ వెళ్లకుడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అర్హులైన లబ్ధిదారులకు రూ.లక్ష అందజేస్తున్నట్లు తెలిపారు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసినందుకు అధికారులను చీఫ్విప్ అభినందించారు. లబ్ధిదారులకు విడుతల వారీగా చెక్కులు అందజేస్తామని తెలిపారు. అలాగే, నియోజక వర్గంలోని కమ్యూనిటీ హాళ్లలో మహిళలకు కుట్టు శిక్షణ నిర్వహించి, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాకుడా గృహలక్ష్మి పథకం కింద 3వేల మందిని ఎంపిక చేయనున్నట్లు ఆయన వివరించారు.
సంక్షేమాన్ని పట్టించుకోని గత పాలకులు
గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోలేదని చీఫ్ విప్ వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజక వర్గాల పరిధిలోని పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు బినామీ పేర్లతో దొంగ బిల్లులు పెట్టి లబ్ధిపొందారని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పార్టీలకతీతంగా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అర్బన్ పరిధిలోని రైతులకు సైతం రైతు బంధు, బీమా ఇవ్వాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ఇప్పిస్తున్నట్లు చీఫ్ విప్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినా సీఎం కేసీఆర్ పెట్టేది లేదని రైతులకు అండగా నిలిచారన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల కష్టాలు, సమస్యలు పట్టించుకోకుండా వారి స్వార్థం కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వరదలను సైతం రాజీకీయం చేశారని విమర్శించారు. తెలంగాణ మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చీఫ్విప్ స్పష్టం చేశారు.
ఆర్థిక అభివృద్ధికి వినియోగించుకోవాలి
బీసీ బంధు పథకం ద్వారా అందజేస్తున్న రూ.లక్షను కుటుంబ ఉపాధి, ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ జీ మహేందర్జీ లబ్ధిదారులకు సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2860 మంది దరఖాస్తు చేసుకోగా ఇంటింటికీ తిరిగి పరిశీలించిన అనంతరం 1873 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 300 మందికి చెక్కులు అందజేసినట్లు చెప్పారు. మిగిలిన వారందరికీ దశల వారీగా చెక్కులు పంపిణీ చేస్తామని మహేందర్జీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, హనుమకొండ ఆర్డీవో రమేశ్, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ కే విజయ్కుమార్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కే శంకరయ్య, కార్పొరేటర్లు ఏనుగుల మానస, నెక్కొండ కవిత, మామిళ్ల రాజు, వేములు శ్రీనివాస్, బోయినపల్లి రంజిత్రావు, సోదా కిరణ్, సంకు నర్సింగ్, ఎలుకంటి రాములు, చెన్న మధు, బీఆర్ఎస్ నాయులు మాడిశెట్టి శివశంకర్, పులి రజినీకాంత్, రాంప్రసాద్, చీకటి ఆనంద్, నలబోల సతీశ్, మేకల బాబురావు, డివిజన్ అధ్యక్షులు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
కుల వృత్తులను ప్రొత్సహిస్తున్న కేసీఆర్
సమైక్య పాలకులు కుల వృత్తులను నిర్లక్ష్యం చేస్తే, తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ మరుగున పడ్డ కృల వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచిత కరెంటు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి నిరంతరం కొనసాగుతోంది. ఆర్థికాభివృద్ధి నోచుకోని కులాలను గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి ఎలాంటి ష్యూరిటీ లేకుండా పూర్తి సబ్సిడీతో రూ.లక్ష అందించడం అభినందనీయం. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడతాం.
– సురేశ్, నాయీబ్రాహ్మణుడు
బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుంది
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి సమంగా పాలన కొనసాగుతుంది. 30 ఏళ్లుగా చూస్తున్నా బీసీలు, కుల వృత్తుల వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చినంక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మాత్రమే బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కుల వృత్తుల వారికి ఆర్థికసాయం చేసి, అండగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. హ్యాట్రిక్ సాధిస్తుంది.
– వెల్సోజు రమేశ్, విశ్వబ్రాహ్మణుడు