హనుమకొండ చౌరస్తా, జనవరి 6: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండకు కేటాయించిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును శుక్రవారం హనుమకొండ బస్స్టేషన్లో వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీలతతో కలిసి వినయ్భాస్కర్ ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో కలిసి బస్సులో ప్రయాణించారు.
ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని డిపోలు నష్టాల్లో నడిచాయని పేర్కొన్నారు. కానీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యంత ప్రామాణికంగా రవాణా వ్యవస్థను నడుపుతూ, ప్రజలను సురక్షితంగా గమ్యానికి చేరవేస్తున్నారని చెప్పారు. మోదీ సరారు ప్రభుత్వరంగ సంస్థలకు అర్రాసు పాడుతుంటే.. సీఎం కేసీఆర్ నష్టాల్లో ఉన్న సంస్థలను కాపాడుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని, ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వరంగల్ రీజియన్కు అధునాతన హంగులతో కూడిన 36 కొత్త బస్సులను కేటాయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రయాణికులు కూడా ఆర్టీసీని చాలా గొప్పగా ఆదరిస్తున్నారని, ఇంటి సంస్థగా భావించి సహకరిస్తున్నారని ఆయన అన్నారు. ఆర్టీసీని అద్భుతంగా ప్రక్షాళన చేసి, ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేయడమే కాకుండా సాంకేతికతను అందిపుచ్చుకుని స్లీపర్ బస్సులను కూడా రూపొందించారని ఆయన అన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్లు సురేశ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.