పరకాల, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ పాలన దేశానికి అవసరమని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశానికి ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి ఆయన హాజరయ్యారు. ముందుగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణతల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటం, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 12 అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్నదని చల్లా అన్నారు. పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. రైతుబంధు పథకం ద్వారా రూ. 467.78 కోట్లు, రైతుబీమా ద్వారా రూ. 23.4 కోట్లు, రూ. 5.75 కోట్లతో 26 రైతు వేదిక భవనాలను నిర్మించినట్లు తెలిపారు.
రూ. 84కోట్లతో 241 చెరువులను పునరుద్ధరించి 15.5 వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చామన్నారు. రూ. 155.61 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టి 16 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టుతో మరో 25 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 100 పడకల దవాఖానను నిర్మిస్తామన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ నూతన సెక్రటేరియట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి రాజ్యాంగ నిర్మాతను గౌరవించారని, దళితబంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు అందిస్తూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎనుమాముల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు..
నడికూడ: మండలంలోని చౌటుపర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో గూడెం అర్జున్ (యూత్ కాంగ్రెస్ మండల సెక్రటరీ), మాదాటి గోవర్ధన్ (చౌటుపర్తి గ్రామ యూత్ అధ్యక్షుడు), దుప్పటి పవన్(గ్రామ కార్యదర్శి), దుప్పటి భరత్ (గ్రామ ఎస్సీ సెల్ సెక్రటరీ), దుప్పటి అన్వేశ్, గూడెం రంజిత్, సొంగ సందీప్, గూడెం నాగేందర్, జట్టి రాము, పుట్టా కృష్ణ, ల్యాదెల్ల అశోక్, తలగంప కృష్ణస్వామి, గుండేడు రాజు ఉన్నారు.