వరంగల్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నేడు ఉమ్మడి జిల్లాకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రానున్నారు. నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం హనుమకొండలోని నిట్ గెస్ట్హౌస్కు వచ్చి బస చేస్తారు. ఆదివారం ఉదయం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వరంగల్ కోర్టుల సముదాయ భవనాన్ని ప్రారంభిస్తారు ఈ మేరకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్తగా నిర్మించిన కోర్టుల సముదాయ భవనం అత్యాధునిక హంగులతో ప్రారంభానికి సిద్ధమైంది. రూ.21.65 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ కోర్టులకు కొత్త భవనాన్ని నిర్మించింది. 1.23 లక్షల చదరపు ఫీట్ల విస్తీర్ణంతో మూడు అంతస్తుల్లో ఈ భవనాన్ని కట్టారు. సముదాయంలో ఫ్యామిలీ, పోక్సో కోర్టులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కరంటు, డ్రైనేజీ, నీటి సరఫరా వ్యవస్థను అత్యాధునికంగా నిర్మించారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇంటర్నెట్, ఇతర సాంకేతిక వ్యవస్థలతో భవనాన్ని అనుసంధానం చేశారు. కొత్త భవనం ప్రవేశ మార్గంలో నిర్మించిన కాకతీయ కళాతోరణం విశేషంగా ఆకట్టుకుంటున్నది. విశాలమైన కొత్త భవనంలోని గదుల కేటాయింపులు పూర్తయ్యాయి. మొదటి అంతస్తులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ ప్లీడర్లు, జడ్జిల మీటింగ్ హాలు, లైబ్రరీ, సెంట్రల్ రూములు, మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా బార్ అసోసియేషన్, సెంట్రల్ నజరాత్, వెయిటింగ్ హాళ్లు, లాబీలు ఉన్నాయి. రెండు, మూడో అంతస్తుల్లో ఐదు చొప్పున కోర్టు హాళ్లు, జడ్జిల డయాస్లు, చాంబర్లు, స్టెనోగ్రాఫర్లు, వెయిటింగ్ హాళ్లు, కోర్టుల సమాచార హాల్ వంటి ఉన్నాయి.
రామప్పలో బందోబస్తు
వెంకటాపూర్ : ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా నేడు దర్శించుకోనుండగా ఏర్పాట్లను ములుగు ఆదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏఏస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 4.30గంటల నుంచి సుమారు రెండు గంటల పాటు వివిధ పూజాకార్యక్రమాల్లో పాల్గొని గైడ్ ద్వారా ఆలయ చరిత్రను సీజేఐ తెలుసుకోనున్నారు. యునెస్కో గుర్తింపు శాశ్వతంగా పొందేందుకు ఆయన పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తున్నది. కాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో ములుగులో భారీ బందోబస్తు కల్పించారు. ప్రతి ఒక్కరిని మూడు చోట్ల స్క్రీనింగ్ చేసిన తర్వాతే ప్రవేశం ఉంటుందని, ఆయన రాక సమయంలో పాస్లు ఉన్న వారికే అనుమతి ఉంటుందని, మూడు గంటల పాటు దర్శనాలను నిలిపి వేస్తామని పర్యాటకులు, భక్తులు గమనించాలని పోలీసులు పేర్కొన్నారు.