వరంగల్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అన్ని మతాలను గౌరవిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి పండుగకు ప్రాధాన్యమిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏటా సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేస్తుంది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు దుస్తులను పంపిణీ చేస్తుంది. క్రిస్మస్ పండుగ సమయంలో క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్స్ను ఇస్తున్నది. ఇందులో భాగంగా ఈనెల 25న జరిగే క్రిస్మస్ పండుగ కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో వెయ్యి మంది పేద క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలను అందజేసేందుకు నిర్ణయించింది. జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
వరంగల్ ఈస్ట్, నర్సంపేట, వర్ధన్నపేటకు మూడు వేల గిఫ్ట్ ప్యాక్స్ కేటాయించింది. ఈ క్రిస్మస్ కానుకలను వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేటలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు భద్రపరిచారు. క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో పేద క్రిస్టియన్లకు ఈ కానుకల పంపిణీ జరగనుంది. స్థానిక ఆర్డీవో, తహసీల్దార్, క్రిస్టియన్ సంఘాల పెద్దలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం కేటాయించిన క్రిస్మస్ కానుకల కోసం సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ కమిటీ స్థానికంగా పేద క్రిస్టియన్లను గుర్తించి జాబితా తయారు చేయనుంది. ప్రస్తుతం ఈ కమిటీలు క్రిస్మస్ కానుకల పంపిణీ కోసం జాబితాలను రూపొందించే పనిలో ఉన్నాయి. క్రిస్టియన్ సంఘాల పెద్దలతో అధికారులు ఇప్పటికే గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ ఏర్పాట్లపై చర్చించారు. ఈనెల 25న జరిగే క్రిస్మస్ పండుగకు ముందుగానే పేద క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్స్ను అందజేసి విందు భోజనాలు సైతం ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లకు విందు భోజనాలను ఏర్పాటు చేయడానికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి రూ.2 లక్షలు కేటాయించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి విక్రమ్కుమార్ వెల్లడించారు. మూడు నియోజకవర్గాల కోసం జిల్లాకు రూ.6లక్షలు వచ్చాయని, వీటితో క్రిస్టియన్లకు విందు భోజనాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.
సాధ్యమైనంత త్వరలో క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్లను ఎమ్మెల్యేల చేతులమీదుగా అందజేసి విందు భోజనాలు ఏర్పాటు చేసే పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. ఆయా నియోజకవర్గంలో జరిగే క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పాల్గొననున్నారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లాలో గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించి క్రిస్మస్ కానుకల పంపిణీ, క్రిస్టియన్లకు విందు భోజనాల ఏర్పాటు కోసం వేదికలను సిద్ధం చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లను వరంగల్, నర్సంపేట, వర్దన్నపేట తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరిచినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి విక్రమ్కుమార్ తెలిపారు.