ఆరుగాలం ఎండనక వాననక కష్టపడి పంట పండించిన మిర్చి రైతుకు మార్కెట్లో నిరాశే మిగులుతోంది. అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా పరిస్థితి నెలకొంది. చేతికొచ్చిన మిర్చిని మార్కెట్లో అమ్ముకుందామంటే ధర లేదు.. ధరలు పెరిగేదాక ఆగుదామంటే నిల్వ చేసుకు నేందుకు కోల్డు స్టోరేజీల్లో జాగలేక తక్కువ రేటుకే అమ్ముకోవాల్సి వస్తాంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో 25 శీతల గిడ్డంగులు ఉండగా, వీటిల్లో ఎక్కువగా వ్యాపారులదే హవా నడుస్తోంది. ఆశించిన ధర దక్కక.. నిల్వ చేసుకునే పరిస్థితి లేక రైతాంగం ఆందోళన చెందుతోంది.
– కాశీబుగ్గ, ఏప్రిల్ 7
మిర్చి దిగుబడి ఈ సంవత్సరం అధికంగా రావడంతో పాటు పక్క రాష్ర్టాల్లో కూడా పంట బాగా పండింది. దీనికి తోడు విదేశాలకు మిర్చి ఎగుమతుల డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున వరంగల్ మార్కెట్కు మిర్చి బస్తాలు వస్తుండడంతో స్థానిక రైతుల మిర్చికి చాలా వరకు డిమాండ్ తగ్గింది. దీంతో పెట్టుబడులు కుడా వచ్చేటట్లు లేవని ఆవేదన చెందుతున్నారు.
చాలా మంది రైతులు ధరలు పెరిగితేనే అమ్ముకునేందుకు మొగ్గు చూపుతుండగా, మరికొందరు తప్పనిసరి తమ అవసరానికి అగ్గువకే విక్రయించాల్సి వస్తున్నది. కొందరు రైతులు ఆశాజనకంగా ఉంటే అమ్ముకుందామని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుందామను కున్నా అక్కడా స్థలం లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. మిర్చి దిగుబడి పెరగడం, డిమాండ్ తగ్గడంతో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ధర లేక, మిర్చిని నిల్వ చేసుకునే పరిస్థితి లేక తమ సరుకును అగ్గువ సగ్గువకు అమ్ముకోవాల్సి వస్తున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో 25 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఒక్కొక్కటి 80 వేల బస్తాల కెపాసిటీ నుంచి లక్షా 20వేల వరకు ఉంది. మొత్తం కెపాసిటీ 27లక్షల 5వేల బస్తాలు(లక్షా 21వేల 725 మెట్రిక్ టన్నులు) ఉంది. ప్రస్తుతం 22లక్షల 28వేల 149 బస్తాల మిర్చి, పసుపు 2లక్షల 69వేల724 బస్తాలు, ఇతర పౌడర్లు 91వేల బస్తాలు (మొత్తం 25లక్ష 90వేల 92 బస్తాలు, లక్షా16వేల554 మెట్రిక్ టన్నులు) ఉన్నాయి. ఇంకా లక్షా 15వేల బస్తాల (5వేల 171 మెట్రిక్ టన్నులు) స్థలం ఖాళీగా ఉంది.
ఈ సీజన్ డిసెంబర్లో ప్రారంభం కాగా, ఇప్పటి వరకు సుమారు 8లక్షల క్వింటాళ్ల మిర్చి(20లక్షల బస్తాలు) మార్కెట్లో క్రయవిక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. కొందరు రైతులు ధరలు నచ్చక కోల్డ్ స్టోరేజీలో మిర్చి బస్తాలు నిల్వ చేసుకున్నారని, మరో రెండు రోజుల్లో పూర్తిగా నిండిపోతాయని చెప్పారు. బయట రాష్ర్టాలకు ఎగుమతి అయితే స్టోరేజీలు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు.
తక్కువ బస్తాలు వచ్చిన క్రమంలో ధరలు ఎక్కువగా చెల్లిస్తూ మిర్చి కొనడం వ్యవసాయ మార్కెట్లో ఆనవాయితీగా వస్తోంది. సరుకు ఎక్కువగా వస్తుంటే వ్యాపారులు ధరలు తగ్గిస్తూ దగా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎనుమాముల మార్కెట్లో మార్కెటింగ్ శాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో దళారులు అందినంత దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి.