ఎర్ర బంగారానికి రికార్డు ధర పలుకుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. క్వింటాకు రూ. 21 వేలకు పైనే ధర ఉండడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. గతేడాది రూ. 18 వేల వరకు అమ్ముడు పోవడంతో మిరప వైపు మొగ్గు చూపారు. తామర పురుగు అశించి దిగుబడి తగ్గినా నిరాశ చెందకుండా మళ్లీ దీని సాగుకే ముందుకు వచ్చారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 56,111 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మూడో కోత చేతికి రావడంతో పంటను మార్కెట్కు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.
నర్సింహులపేట, ఏప్రిల్ 21: మిర్చి రైతుకు కాలం కలిసొచ్చింది.. ఎర్ర మిర్చికి మార్కెట్లో రికార్డు స్థాయిలో మద్దతు ధర పలుకుతున్నది.. ఫలితంగా రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఈ ఏడాది తామర పురుగు కారణం గా దిగుబడి తగ్గినా, ధర అధికంగా పలుకడంతో కాస్తా ఊరట కలిగిందంటున్నారు. ఇంత ధర గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు సైతం చెబుతున్నారు. గతంలో తామర పురుగు కారణంగా ఒక కోత చేతికి వస్తే మహాభాగ్యంగా భావించేవారు. ఇప్పుడు మూడో కోత చేతికి రావడంతో ఆనందంతో తరలిస్తున్నారు.
ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురవడంతో రైతులు అనందంగా పంటలు సాగు చేశారు. కానీ అధికంగా పడడంతో కొంత ఇబ్బంది పడినా మిర్చిలో నాణ్యత పెరుగుతుండడంతో రైతులు మంచి లాభాలు గడిస్తున్నారు. తెలంగాణ మిర్చి ఆల్టైం రికార్డు స్థాయికి చేరింది.
క్వింటాకు రూ.20వేల నుంచి రూ.22వేలకు పైన కొనుగోలు చేస్తుండడంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో మిరప పంటను ఎర్రబంగారంగా పిలుస్తాం. నల్ల రేగడి, ఎర్ర నేలలు ఈ పంటకు అనువుగా ఉంటాయి. కొన్ని జాగ్రతలు పాటిస్తే సంపద కూడా అదే స్థాయిలో ఉంటుంది. మిరప ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎగుమతికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆహారానికి రంగు, రుచి ఇవ్వడమే కాకుండా ఇందులో విటమిన్లు, ఔషద లక్షణాలు ఉండడంతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఇదే పంటను సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 56,111 ఎకరాల్లో మిర్చి సాగు అవుతున్నది. కురవి, మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్, నర్సింహులపేట మండలాల్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. నిరుడు మిర్చి ధర రూ.18వేల వరకు పలుకడంతో రైతులు ఈ పంటపై మొగ్గు చూపారు. గతేడాది తామర పురుగు అశించి దిగుబడి తగ్గినా నిరాశ చెందకుండా, ఈ సంవత్సరం మిరప సాగు పెంచారు. ధర సైతం అధికంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర పంటల స్థానంలో మిర్చి సాగు..
ఈ ఏడాది అనుకున్న ఎక్కువ వర్షాలు కురవడంతో పెసర ఇతర పంటలు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో మిర్చి సాగు చేశారు. ఇతర పంటల దిగుబడి లేక పోయిన మిరప ధర ఎక్కువగా ఉండడంతో నష్టం ఉండదని చెబుతున్నారు. ఎకరానికి రూ.50వేల నుంచి రూ. 70 వేల వరకు పెట్టుబడి వస్తుందని, ధర ఎక్కువగా ఉండడంతో లాభాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
మిరప రైతులు పంటల్లో వచ్చే చీడపీడల నివారణకు జాగ్రతలు తీసుకోవాలి. తామరపురుగు బెడద తప్పింది. ఆకు ముడుత, కాయ తొలుచు పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉన్నందున నీటి తడులు అందించాలి. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనాల మేరకు మందులు పిచికారీ చేయాలి.
– ఛత్రూనాయక్, డీఏవో
మిర్చిపైనే ఆశలు
మూడు ఎకరాల్లో మిర్చి సాగు చేసిన. తొలుత తామర పురుగు వస్తుందని భయంతో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనాల మేరకు మందులు పిచికారీ చేసిన. దిగుబడి బాగా వచ్చింది. ఇక్కడ కూలీలు దొరక్కపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారితో మిరపకాయాలు ఏరిపించాను. మొదటిసారి ఏరిన మిర్చి సుమారు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మళ్లి కొమ్ములు బాగా వచ్చి మూడో కాత డాడా వచ్చింది. – జాటోత్ శ్రీను, ఎర్ర ఛకృతండా
ధర మంచిగున్నది
నిరుడు మిరప పంటకు తామర పురుగు అశించి దిగుబడి తగ్గింది. అయినా ఈఏడాది రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేసిన. ఇప్పటికి 20 క్వింటాళ్ల వరకు ఏరించినా. ఇప్పుడు చెట్లు బాగానే ఉన్నాయి. ధర రూ.20వేలకు పైన ఉన్నది. మరోసారి కాయలు ఏరే అవకాశమున్నది. నిరుడు కంటే ధర ఎక్కువగానే పలుకుతున్నది.
– లకావత్ బిచ్చు, బీల్యాతండా