నయీంనగర్, జూన్ 9 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం సంక్షేమ సంబురాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వినయ్భాస్కర్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ఆత్మబంధు సీఎం కేసీఆర్ అని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరానిస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు దళిత బంధును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా కేసీఆర్ అందిస్తున్న సహాయమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అని గుర్తు చేశారు. అన్నదాతకు అండగా ఉండేందుకు రైతు బంధు, రైతుబీమా, ఉచిత కరంట్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల విద్యార్థులకు ఉన్నత చదువులు అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. బీసీ చేతివృత్తి కులాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష, గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ ఉన్నత విద్య కోసం మహాత్మ జ్యోతిబాఫూలే, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లను ప్రవేశపెట్టారని తెలిపారు. బీడీ కార్మికులు, గీతన్నలు, నేతన్నలకు ప్రత్యేక పెన్షన్, ఎస్సీలకు 100 యూనిట్లు, రజక, నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేశారన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం, సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్ల అభివృద్ధి, నూతన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 24 మంది లబ్ధిదారులకు గొర్రెలను, 108 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను చీఫ్విప్ అందజేశారు. అలాగే, జీవో 58, 59 కింద 11మంది పేదలకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా రైతుబంధు సమితి కోఆర్డినేటర్ లలిత, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్సింగ్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వరంగల్/గిర్మాజీపేట, జూన్ 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కీర్తి గార్డెన్లో 11, 29 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు షాదీ ముబాకర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కల్పలత సూపర్బజార్ వైస్చైర్మన్ ఎండీ షఫీ, బీఆర్ఎస్ నాయకులు దేవరకొండ సురేందర్, కొడకండ్ల సదాంత్, రాచర్ల రాము, జగన్, గట్టు చందు, ఎస్కే రెహమాన్, మాల్వ రాజు, మట్టెవాడ సారంగం, మంద చంటి, వాసు పాల్గొన్నారు.