నయీంనగర్, ఏప్రిల్ 14 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని, దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అమలు చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే, కొన్ని దుష్టశక్తులు అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా పని చేస్తున్నాయని మండిపడ్డాడు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రలోని మోదీ సర్కారు కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆరోపించారు. వేడుకల్లో జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, కుడా చైర్మన్ సుందర్రాజ్, వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్, జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో వాసుచంద్ర, హనుమకొండ తహసీల్దార్ రాజ్కుమార్, కార్పొరేటర్ నల్లా స్వరూపారాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఆశయ సాధనకు పునరంకితం
హనుమకొండ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ప్రపంచం హర్షించేలా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించినటట్లు చెప్పారు. అలాగే, చారిత్రక వరంగల్ నగరంలో కూడా అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు సీఎం కేసీఆర్ పాలన చేస్తూ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. అంబేద్కర్ పేద, బడగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడ్డారన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలయ్యేలా ప్రతి అంబేద్కర్ వారసుడు కృషి చేయాలని సూచించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి బడాబాబులకు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని అంబేద్కర్ వారసులు తిప్పికొట్టాలన్నారు. సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ వరకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతున్నారని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ప్రశ్నపత్రాలు లీకేజీ చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలను పోరుగల్లు ఓరుగల్లు ప్రజలు నమ్మరని దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, జడ్పీ చైర్మన్ ఎం సుధీర్కుమార్, అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్, అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.