హనుమకొండ, అక్టోబర్ 31 : కాంగ్రెస్ పార్టీకి గూండాయిజం, దాడులు కొత్తకాదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి నేపథ్యంలో మంగళవారం సాయంత్రం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణతో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే అక్కసుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాలు, రౌడీలను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులకు దిగడం హేయమైన చర్య అన్నారు. కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు తెలిపారు. అమలుకాని వాగ్దానాలతో కర్ణాటకలో గద్దెనెక్కి, అక్కడి నుంచి డబ్బుల మూటలు తెలంగాణకు తీసుకొచ్చి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరోసారి తెలంగాణ ప్రజలను మోసపూరిత, అమలుకాని వాగ్దానాలతో మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గాంధేయ మార్గంలో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అంబేదర్ ఆలోచనలతో అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. అందుకే కేసీఆర్ను దేశం కావాలంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అక్రమంగా డబ్బును పంపిణీ చేసి, ఎన్నికల్లో గెలువాలని చూస్తోందన్నారు. ఎంపీ ప్రభాకర్రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్ కుట్రలపై కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేస్తామని చీఫ్విప్ తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందులో నేను కూడా ఉంటానని వినయ్భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్య, పులి రజినీకాంత్, సారంగపాణి, నార్లగిరి రమేశ్, వర్ధమాన్ జనార్దన్, వీరగంటి రవీందర్ పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్, బీజేపీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్కు వరంగల్ పశ్చిమ నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం జిల్లా ఎన్నికల అధికారికి వినతి పత్రం అందజేశారు. అలాగే, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారాలు చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెంటనే విచారణ జరిపించి, తగు చర్యలు తీసుకుంటామని అన్నారని, లిఖితపూర్వక ఫిర్యాదును ఎన్నికల కమిషన్కు పంపిస్తామని తెలిపినట్లు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.