వర్షాల నేపథ్యంలో అధికార, పాలకవర్గాలు అప్రమత్తమయ్యాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు, ఇతర జల వనరులు నిండడంతో పాటు లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లోకి ఇంకా వరద అలాగే ఉంది. రెండు రోజుల నుంచి వర్షం కాస్త తెరిపినిచ్చినా వరద తీవ్రత అలాగే ఉండడంతో పలుచోట్ల ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. అలాగే వర్షాకాలం వ్యాపించే సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం తేలికపాటి జల్లులు కురిసినప్పటికీ వరద తీవ్రత అలాగే ఉండడంతో అధికార, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఇందులో భాగంగా హనుమకొండ బస్స్టేషన్ పరిసరాల్లోకి వరద నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండడంతో కలెక్టర్ సిక్తాపట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్బాషా, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలతతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
అలాగే యూత్ హాస్టల్, ఆర్డీవో ఆఫీస్, ఎమ్మార్వో కార్యాలయాల్లోనూ కలియదిరిగి వెంటనే పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న కార్యాలయాన్ని మరోచోటికి మార్చడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలని దాస్యం ఆదేశించారు. అలాగే లింగాలఘనపురం మండలం పటేల్గూడెం లో లెవల్ కల్వర్టు వద్ద వరద నీరు పారుతుండడంతో జనగామ-పాలకుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోగా కలెక్టర్ శివలింగయ్య పరిశీలించారు.
నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉన్నందున భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాత్కాలిక దారి మళ్లించడంతో పాటు ఇరువైపులా ట్రాక్టర్లు అడ్డుగా సిబ్బందిని కాపాలా పెట్టారు. అలాగే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి, కొత్తపేట గ్రామాల్లో కలెక్టర్ శశాంక క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీధుల్లో వెంట కలియదిరుగుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంటి సమీపంలో మురుగునీరు, చెత్త వంటివి ఉండకుండా చూసుకోవాలని తద్వారా వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు.
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి వరద తీవ్రత రోజురోజుకూ మారుతున్నది. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటు ఏటూరునాగారం, మంగపేట వద్ద ఉధృతి పెరుగుతున్నది. ఈక్రమంలో పరిస్థితిని బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. శనివారం మంగపేటలో పర్యటించిన మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి వరదలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వరదలు తీవ్రమైనప్పుడు వెంటనే ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పోలీస్, రెస్క్యూ టీములను రంగంలోకి దింపాలని ఆదేశించారు. ఇలా అధికార, పాలక యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అండగా నిలుస్తున్నది.
– నమస్తే నెట్వర్క్, జూలై 22