గణపురం, నవంబర్ 7 : మండలంలోని చెల్పూర్ గ్రామాన్ని రూ. 7 కోట్లతో అభివృద్ధి చేశానని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్రావు, ఎంపీటీసీ చెన్నూరి రమాదేవీ మధుకర్ ఆధ్వర్యంలో మంగళవారం చెల్పూర్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. దీనికి గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరై ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కారుగుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా చెల్పూర్ గ్రామ మహిళలు కోలాటాలు, డప్పుచప్పుళ్లు,మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గండ్ర మాట్లాడుతూ తన తండ్రి పుట్టిన చెల్పూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకున్నానన్నారు.
అయినప్పటికీ తమ పాలివాళ్లు కదనరంగంలో తనను వదిలి ఇతర పార్టీలోకి వెళ్లారన్నారు. పాము, పాలి పగలు మహాభారతంలోనే ఉన్నాయన్నారు. లీడర్లు పోయినంత మాత్రాన క్యాడర్ పోదని, చెల్పూర్లో తనకు ప్రజాబలం ఉందన్నారు. కట్టప్పలు ఎంతమంది పార్టీ మారినా చివరికి ప్రజల ఆశీర్వాదమే తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తుందన్నారు. భూపాలపల్లిలో గులాబీ జెండాను ఎగురవేస్తానన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారని, తనను స్థానిక శాసనసభ్యుడిగా, చెల్పూర్ గ్రామ బిడ్డగా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ దొంగ మాటలు మాట్లాడుతూ తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే నిరూపించాలన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తనపై విష ప్రచారం చేస్తే ప్రజలు చిత్తు గా ఓడిస్తారన్నారు. చెల్పూర్ గ్రామ ప్ర జలు తాను చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటువేయాలని గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు.
పదేండ్లలో జరిగిన అభివృద్ధి మరిం త ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడిని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. కొంతమంది నాయకులు ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తమకు ప్రజాబలం ఉందని, వారే బీఆర్ఎస్ను గెలిపిస్తారని గండ్ర జ్యోతి అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి, భూపాలపల్లి ఏఎంసీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, కేశవరావు, దేవేందర్ గౌడ్, శశిరేఖా రాంచంద్రారెడ్డి, కుమార స్వామి, అరుణా తిరుపతిరావు, శివశంకర్ గౌడ్, మేకల రజిత, రజియా, అశోక్, రమేశ్, రాజు, శ్రీనివాస్రావు, రవీందర్, శంకర్, మల్లికార్జున్, తిరుపతి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.