జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కల సాకారమైంది. గ్రామాల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న జేపీఎస్లను రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయి. హనుమకొండ జిల్లాలో 129 మందికి లబ్ధి చేకూరనుండగా, క్రమబద్ధీకరణ ప్రకటనతో పంచాయతీ కార్యదర్శులు సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడుతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని చెబుతున్నారు.
– హనుమకొండ, మే 25
హనుమకొండ, మే 25 : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రామాల అభివృద్ధిలో కీలకంగా ఉన్న జేపీఎస్లు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. రెగ్యులర్ ప్రకటన నేపథ్యంలో జేపీఎస్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హనుమకొండ జిల్లాలో 129 మందికి, ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి మందికిపైగా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అని అంటున్నారు.
కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు..
జేపీఎస్ల రెగ్యలర్ ప్రక్రియకు సంబంధించి కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జేపీఎస్ల పనితీరును సమీక్షించడంతో పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో నివేదికలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఇందుకు మార్గదర్శకాలను రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారు.
జిల్లా కమిటీలో స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న అదనపు కలెక్టర్, జిల్లా అటవీ శాఖ, ఎస్పీలేదా డీఎస్పీ స్థాయి అధికారిని సభ్యులుగా నియమించనున్నారు. జిల్లా స్థాయి కమిటీ పంపించిన తుది నివేదికను రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి సీఎస్కు అందజేసిన అనంతరం క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
జేపీఎస్ల జీవితాల్లో వెలుగులు : ఏ శ్రీకాంత్, పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును రెగ్యలర్ చేయనున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో జేపీఎస్లు ఆనందంగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరింత ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తాం.
క్రమబద్ధీకరణ ప్రకటన హర్షణీయం..
గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దడంలో, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో కీలంగా వ్యవరిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కృషిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రెగ్యులరైజ్ ప్రక్రియకు విధి విధానాలు రూపొందించాలని ఆదేశించడం సంతోషం మరింత ఉత్సాహంతో తెలంగాణ పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. సీంఎ కేసీఆర్కు, మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు.
– ఆకారపు సురేశ్, టీపీఎస్ఎఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు