హనుమకొండ సబర్బన్/ఎల్కతుర్తి/భీమదేవరపల్లి : కేంద్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనేక కొర్రీలు పెడుతోందని, ఇప్పటికైనా వైఖరి మార్చుకొని ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్; గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశా రు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో రైతువేదికల ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ఆయిల్పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి మంత్రి దయాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని మిల్లులు, గోదాముల్లో బియ్యం పూర్తి స్థాయిలో నిల్వ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటిని ఇంత వరకు ఖాళీ చేయడం లేదని విమర్శించారు. 40 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్న తనకు ఇద్దరంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే నచ్చారని తెలిపారు. వీరిలో ఎన్టీ రామారావు ఒకరైతే ప్రస్తుత మన సీఎం కేసీఆర్ అని అన్నారు. ఎన్టీ రామారావు 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడంతో పాటు భూమి శిస్తును రద్దు చేసి చారిత్రక నిర్ణయాలను తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ అభివృద్ధిలో రాష్ర్టాన్ని పరుగులు తీయిస్తున్నారు.
దివ్యాంగులకు రూ.3వేలు, వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఇతరత్రా రూ.2వేల చొప్పున ఆసరా పింఛన్ ఇస్తున్నారని పునరుద్ఘాటించారు. తాను ఇటీవల ఛత్తీస్గఢ్, కర్ణాటకకు వెళ్లినప్పుడు అక్కడా రూ.500 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. అదీ స్కూటర్ ఉంటే లేదు, ఎకరం భూమి ఉన్నా లేదు, ఇల్లున్న వారికి లేదు, వెయ్యి మంది ఉన్న ఊర్లో కేవలం 10 మందికే ఇస్తున్నరంటే బీజేపీ సర్కారు ఏ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో వంటనూనెలకు భారీ డిమాండ్ ఏర్పడనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. దీంతో 30 ఏండ్ల పాటు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున రైతులకు ఆదాయం లభించనుందని వివరించారు. తాను కూడా సొంతంగా 80 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నానని పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భీమదేవరపల్లి మండలంలోని వంగరలో భూ సేకరణ చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో భూమి కేటాయించేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు భూమిని కేటాయించాలని చెప్పారు. రూ.15 వేల కోట్లను డ్వాక్రా సంఘాల కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఆయిల్పామ్ సాగుకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే వొడితెల
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆయిల్పామ్ సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండేపల్లిలో ఆయిల్పామ్ సాగు చేయడానికి ముందుకు వచ్చిన రైతులను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో సాగునీటిని తేవడంతో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని వివరించారు. భీమదేవరపల్లి మండలం వంగరలో ఆయిల్పామ్ కంపెనీని ఏర్పాటు చేస్తే రైతులకు సౌకర్యంగా ఉంటుందని మంత్రిని ఎమ్మెల్యే సతీశ్కుమార్ కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.