మహబూబాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా.. స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేమని బీజేపీ సర్కారు తేల్చి చెప్పి యువత ఆశలకు గండికొట్టింది. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా నిర్మాణం సాధ్యం కాదని కరాఖండిగా తేల్చి చెప్పి తెలంగాణపై వివక్షను మరోమారు బయటపెట్టుకున్నది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లి సమీపంలోని పెద్దగుట్టతో పాటు రామచంద్రాపురం, మొట్లతిమ్మాపురం అటవీ ప్రాంతంలో 60 ప్లస్ శాతం కలిగిన ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే స్థానిక యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని నాటి ప్రభుత్వ పెద్దలు భావించి విభజన చట్టంలో పొందుపర్చారు. సెయిల్ ఆధ్వర్యంలో రూ.30వేల కోట్లతో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని చట్టంలో పేర్కొన్నారు. దీని ప్రకారం బయ్యారంలో స్టీల్ప్లాంట్ నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అపార ఇనుప ఖనిజం విస్తరించి ఉంది. బయ్యారం, గార్ల, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాల్లో 56,690 హెక్టార్ల భూమిలో ఇనుప ఖనిజం నిక్షిప్తమై ఉంది. ఇక్కడ ఉన్న ఇనుప ఖనిజం విలువ సుమారు ఏడు వందల లక్షల కోట్లు ఉంటుందని సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేసింది. 1,41,691ఎకరాల్లో నిక్షేపాలు ఉన్నాయని నాడే గుర్తించింది. గూడూరు, భీమదేవరపల్లి, బయ్యారం, గార్ల, నేలకొండపల్లిలో లభించే ఇనుప రాయిలో అత్యధికంగా 80శాతం బయ్యారంలోనే ఉందని గతంలో నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. బయ్యారంలో ప్లాంట్ నిర్మాణానికి అన్ని అనుకూలతలు ఉన్నాయని కేంద్రానికి నివేదిక కూడా ఇచ్చింది. ఇక్కడ ఖనిజం సరిపోకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బైలడిల్లా నుంచి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు తెలిపింది. అయినా కేంద్రం పెడచెవిన పెట్టి, తొమ్మిదేళ్లుగా కాలయాపన చేసింది. విభజన హామీని నెరవేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా అవి బుట్టదాఖలే అయ్యాయి. ప్రైవేట్ సెక్టార్లో స్టీల్ తక్కువ ధరకు దొరుకుతున్నదని, అందువల్ల పరిశ్రమ నిర్మించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇక్కడ నాణ్యమైన ఖనిజం లేదంటూ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడారు.
వాస్తవంగా చూస్తే.., బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించేందుకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. గతంలో సర్వే నిర్వహించిన జీఎస్ఐ, సెయిల్, సింగరేణి వంటి సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బయ్యారంలో మొట్టమొదట 1954లోనే మైనింగ్ ప్రారంభమై 1969 వరకు కొనసాగింది. అప్పట్లోనే ఆక్కడి ఇనుప ఖనిజాన్ని రష్యా, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేశారు. ఉక్కు కర్మాగారానికి నాలుగు టీఎంసీల నీరు అవసరముంటుంది. సీతారామ ప్రాజెక్టులో భాగంగా బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్గా మారిస్తే ఏడాది పొడవునా ఇక్కడ రెండు టీఎంసీల నీరు నిల్వ ఉండే అవకాశముంది. పరిశ్రమ నిర్మాణానికి అనువైన స్థలం ఉంది. బయ్యారం మండలం ధర్మాపురం రెవెన్యూ పరిధిలోని 452 సర్వే నంబర్లో 4వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కర్మాగారానికి కావాల్సిన స్థలం 2,200 ఎకరాలు మాత్రమే. బయ్యారంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. రవాణా ఖర్చు చాలా తగ్గుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే మార్గం పక్కనే ఉన్న గార్ల మండలంలో ఉంది. ధర్మాపురానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. విద్యుత్ సౌకర్యం కోసం మహబూబాబాద్ శివారులోని అనంతారం సబ్స్టేషన్ అనువుగా ఉంటుందని గతంలో నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఇన్ని అనుకూలతలు ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటికీ నెరవేర్చలేదు. నాడు సీమాంధ్ర పాలకుల హయాంలో దోపిడీకి గురవుతున్న బయ్యారం ఖనిజాన్ని ఉద్యమం చేసి అడ్డుకున్నాం. అప్పటి ఉద్యమాల ద్వారానే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామీ వచ్చింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నా కేంద్రం ముందుకు రావడం లేదు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఇప్పటికైనా కేంద్రం స్పష్టమైన వైఖరి తెలుపాలి. లేదంటే ప్రజల మద్దతుతో మరోమారు ఉద్యమం తప్పదు.
-రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఊసెత్తక పోవడం చూస్తుంటే తెలంగాణపై ఉన్న వివక్ష అర్థమవుతున్నది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కోసం నిధులు కేటాయిస్తారని ఎదురు చూస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలు మార్లు ప్రధానికి, కేంద్ర మంత్రులకు విన్నవించినా పెడచెవిన పెట్టారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడితే వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికైనా పరిశ్రమ ఏర్పాటు ప్రక్రియను కేంద్రం వెంటనే ప్రారంభించాలి. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.
– మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత