తాడ్వాయి, ఫిబ్రవరి 23 : మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మంత్రులతో కమిటీ వేసి తానే పర్యవేక్షిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని ఎత్తు బంగారం సమర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈ నెల 27న మరో రెండు హామీలను ప్రారంభిస్తామని రూ.500కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. వచ్చే జాతరలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ దేవాదాయ శాఖ ద్వారా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జాతర వచ్చినప్పుడే కాకుండా మేడారం అభివృద్ధికి మంత్రుల సహాయంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, కలెక్టర్ ఇలాత్రిపాఠి, ఎస్పీ డాక్టర్ పీ శబరీష్, ప్రభుత్వ విప్ మురళీనాయక్, ఐటీడీఏ పీఓ అంకిత్ పాల్గొన్నారు.