హనుమకొండ, ఫిబ్రవరి 9: ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన నాటి నుంచి పోరాటాలు చేసినా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ 14 ఏళ్ల ఉద్యమంతో దిగొచ్చిన నాటి కేంద్రం రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టిందని గుర్తుచేశారు. రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాలన్న సీఎం మాటలను వక్రీకరిస్తున్నారన్నారు. తెలంగాణకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రంలోని బీజేపీ కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోతెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని హేళన చేస్తే ప్రజలు తరిమి కొడుతారని హెచ్చరించారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు సిగ్గూశరం ఉంటే రాజీనామా చేయాలని, రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలని హితవు పలికారు.
ప్రధాని వ్యాఖ్యలతో తెలంగాణ అగ్ని గుండం కాబోతున్నదని, ఇందులో బీజేపీ భస్మం అవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్పై ప్రధానంగా తెలంగాణ ప్రజలపై అక్కసు వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న కాకినాడ తీర్మానాన్ని తుంగలో తొకింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఆనాడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను విభజించిన బీజేపీ తెలంగాణ విభజనను ఎందుకు చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ విభజన కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీ అన్ని కులాలు, సంఘాలు, ప్రజా సంఘాలతో మాట్లాడితే బీజేపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల ప్రజ ఆదరణ పొందుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రస్తుతం వెంటిలేటర్పై ఉందన్నారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తున్నదని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల పోరాటాలు, కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ఎవరి అనుమతితో లోయర్ సీలేరు ప్రాజెక్టు సహా ఏడు మండలాలను ఆనాడు ఏపీలో కలిపారని ప్రశ్నించారు. బీజేపీ నిజ స్వరూపం ఇదే అని రాజ్యసభ సాక్షిగా మరోసారి ప్రధాని చాటారన్నారు. బీజేపీ నాయకుల్లారా ఖబడ్దార్ తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. దక్షిణాది రాష్ర్టాలకు బీజేపీ అన్యాయం చేస్తున్నదన్నారు.
కాజీపేట, ఫిబ్రవరి 9: కాజీపేటకు రైల్వే వ్యాగన్ పీవోహెచ్ నిర్మాణానికి ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోవడంతో రైల్వే ఆర్వీఎన్ఎల్ సంస్థ టెండర్ కాల్ఫర్ చేసింది. ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్ పీవోహెచ్ నిర్మాణానికి కావాల్సిన భూమిని రైల్వే శాఖకు అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో కొంతకాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, జిల్లా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలంగాణ రైల్వే జేఏసీ, పలు స్వచ్ఛంద సంస్థలు చేసిన పోరాటం, కృషి ప్రస్తుతం ఫలించింది. కాజీపేట సమీపంలోని అయోధ్యపురం గ్రామ శివారులో నిర్మాణం చేపట్టే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ నిర్మాణానికి రైల్వే ఆర్వీఎన్ఎల్ సంస్థ ఫిబ్రవరి 1న టెండర్ను పిలిచినట్లు రైల్వే వర్గాలు తెలిపారు. ఈ బడ్జెట్లో పీవోహెచ్ షెడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 45 కోట్ల నిధులు కేటాయించింది.
ఖిలావరంగల్, ఫిబ్రవరి 9: హాస్టల్ నుంచి పారిపోయిన ముగ్గురు బాలికలను టీసీ వరంగల్ రైల్వేస్టేషన్లోని హెల్ప్డెస్క్ సిబ్బందికి అప్పగించారు. హెల్ప్డెస్క్ కో ఆర్డినేటర్ రాజు కథనం ప్రకారం.. మేడ్చల్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ముగ్గురు బాలికలు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. హాస్టల్లో ఉండడం ఇష్టం లేక మంగళవారం అర్ధరాత్రి గేటు దూకి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చి కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. టీసీ టికెట్ తనిఖీ చేస్తున్న క్రమంలో బాలికల ప్రవర్తనపై అనుమానం వచ్చి వరంగల్ రైల్వేస్టేషన్లో దింపి హెల్ప్డెస్క్ సిబ్బందికి అప్పగించారు. సిబ్బంది బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చి హోమ్కు తరలించినట్లు రాజు తెలిపారు.