ఏటూరునాగారం, మార్చి 13 : సీబీఐ డైరెక్టర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి విజయరామారావు(85) కన్నుమూశారు. ఏటూరునాగారానికి చెందిన విజయరామారావు సోమవారం ఉదయం అనారోగ్యంతో ఉండడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మృతి చెందారు. విజయరామారావు తన ప్రాథమిక విద్య(రెండో తరగతి)ను ఏటూరునాగారంలోనే ప్రారంభించారు. తర్వాత నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని అమ్మమ్మ గారి ఇంటి వద్ద చదువుకున్నారు. అక్కడ నుంచి మద్రాసు యూనివర్శిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తొలుత కరీంనగర్లో లెక్చరర్గా పనిచేసిన ఆయన 1959లో ఐపీఎస్కు ఎంపికయ్యారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా, సీబీఐ డైరెక్టర్గా, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్టీసి ఎండీగా పనిచేసిన కాలంలో ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కొందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన తన కుటుంబంతో హైదరాబాద్లో స్థిర పడ్డారు. అనంతర పరిణామాల్లో టీడీపీలో చేరి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిం చారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. బీఆర్ఎస్లో ఆయన కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఏటూరునాగారంలో విజయరామారావుకు సొంత ఇల్లు ఉంది. ఇక్కడ విజయరామారావు తమ్ముడు చక్రధర్రావు స్థిరంగా ఉంటున్నారు.
చక్రధర్రావు కూడా ఏటూరునాగారం సర్పంచ్గా పనిచేశారు. మండల కేంద్రంలో విజయరామారావుకు బాల్య మిత్రులు కూడా ఉండడంతో ఆయన ఏటూరునాగారం వచ్చినపుడు కలుస్తుంటారు. విజయరామారావు మృతి చెందిన వార్త ఏటూరునాగారంలో వ్యాపించడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన జ్ఞాపకాలను స్థానికులు నెమరు వేసుకుంటున్నారు.