హనుమకొండ/కరీమాబాద్, ఏప్రిల్ 23 : గత ఎన్నికల్లో కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన ప్రజలు మరోసారి ఆ తప్పు చేయవద్దని, తెలంగాణ కోసం కొట్లాడే కేసీఆర్కు అండగా నిలువాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కోరారు. వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘ప్రజల కోసం పోరాడే సత్తా కేసీఆర్కు ఉంది. అందుకే ఆలోచించి ఓటు వేయాలి. మరోసారి ఆగమైతే గోస పడుతాం. వరంగల్ మొదటినుంచీ బీఆర్ఎస్ గడ్డ అని, కష్టపడితే వరంగల్లో గెలుపు మనదే. విశ్వాసఘాతకులు కడియం శ్రీహరి, అరూరి రమేశ్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
అన్ని అవకాశాలు ఇచ్చిన బీఆర్ఎస్ను మోసం చేసిన కడియం శ్రీహరి, అరూరి రమేశ్ విశ్వాస ఘాతకులు అని కేటీఆర్ అన్నారు. ‘కడియం శ్రీహరి 2013లో పార్టీలోకి వచ్చిండు. రాగానే ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు ఇచ్చినం. కేసీఆర్ పదేండ్లలో కడియం శ్రీహరిని మూడు చట్టసభల్లోకి పంపించాడు. కడియం శ్రీహరి నయవంచకుడు. నమ్మించి గొంతు కోశాడు. కేసీఆర్ సార్ కడియం బిడ్డకు టికెట్ ఇచ్చిండని నాకు ఫోన్ చేసిండు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటాను కలవాలని అడిగిండు. నేను కేసీఆర్ పీఏలకు చెప్పి పంపిన. మరుసటి రోజు కుటుంబంతో కలిసి కేసీఆర్ను కలిసి అక్కడే భోజనం చేసిండు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నడు. కడియం బిడ్డ కావ్య నాకు ఫోన్ చేసి వాళ్ల ఆయన ఆంధ్రా అని కేసీఆర్కు ఫ్యాన్ అయ్యిండని చెప్పింది. ఏమైందో తెలియదు మరుసటిరోజు సాయంత్రం లేఖ పంపిండు. ఇంత ద్రోహం, మోసం, అన్యాయం ఎక్కడైనా ఉంటదా? నయవంచకుడు, తడిగుడ్డతో గొంతు కోసేవాడు కడియం శ్రీహరి. పార్టీ మారుడు తప్పు కాదు. ద్రోహం చేసుడు తప్పు. అరూరి రమేశ్ అంతే. రమేశ్కు బీఆర్ఎస్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కడియం, అరూరి ఇద్దరు విశ్వాస ఘాతకులు. అరూరి రమేశ్ బీజేపీకి పోయిండు. నమ్మించి గొంతుకోసుడు బరాబర్ తప్పు. సుధీర్కుమార్ కేసీఆర్ వెన్నంటి ఉన్న నాయకుడు. అందరం కష్టపడి పని చేస్తే సుధీర్కుమార్ గెలుపు సాధ్యమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై, కార్యర్తలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ఎక్కడివాళ్లు అక్కడే కష్టపడితే ఏడాదిలోపు బీఆర్ఎస్ రాష్ర్టాన్ని శాసించే అవకాశం ఉంటుంది. ఫలితాలు మనకు అనుకూలంగా ఉంటే ఏ అధికారైనా, పోలీసు అయినా భయపడుతరు. వరంగల్ మొదటి నుంచి బీఆర్ఎస్ గడ్డ. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుందం’ అని కేటీఆర్ అన్నారు.
గత ఎన్నికల వేళ బూటకపు మాటలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ది ఎన్నికల ముందు అభయహస్తం.. తరువాత భస్మాసుర హస్తం అని విమర్శించారు. మొదటిసారి మోసపోతే అది మోసం చేసిన వారి తప్పు అని, మరోసారి మోసపోతే అది మన తప్పవుతుందన్నారు. మాయమాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ 100 రోజుల్లో చేస్తానన్న హామీలను అమలు చేయలేదన్నారు. మళ్ల్లీ కాంగ్రెస్కు ఓటు వేస్తే ఇక హామీలు అసలు అమలు చేయరన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసం-1 చూపిన కాంగ్రెస్ మోసం పార్ట్-2 చూపుతుందన్నారు. హామీలు అమలు చేయకుండానే మళ్లీ ఓట్ల కోసం వస్తుందన్నారు. కాంగ్రెస్కు భయం పుట్టాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. కష్టపడితే వరంగల్లో గెలుపు మనదేనన్నారు. ఇక కేంద్రంలో బీజీపీ వచ్చాక ధరలు భారీగా పెరిగాయన్నారు. కేసీఆర్ ఎన్నో యాగాలు చేశారు.. ఆలయాలను నిర్మించారన్నారు. కానీ దేవుడితో ఏనాడూ రాజకీయం చేయలేదన్నారు. సమావేశాల్లో లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సుందర్రాజుయాదవ్, వాసుదేవరెడ్డి, మెట్టు శ్రీనివాస్, బొల్లం సంపత్, రైతు కో ఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, బోగి సువర్ణ, టీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, రమేశ్, చింతల యాదగిరి, జనార్దన్గౌడ్ పాల్గొన్నారు.
ఆగస్టు 15వ తేదీ వరకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ప్రమాణం చేయడం కాదు.. చేయకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని గవర్నర్కు లేఖ రాసివ్వాలని సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు. తాను చేయించిన సర్వేల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్కే అధిక మెజార్టీ ఉందని, 50వేల మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. కేసీఆర్ను ఓడగొట్టి తప్పు చేశామని, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన కడియం శ్రీహరి, అరూరి రమేశ్పై ప్రజల్లో కసి, కక్ష పెరిగిందన్నారు. వరంగల్ పార్లమెంట్లో ఉద్యమకారుడు, నిజాయితీపరుడు, మచ్చలేని డాక్టర్ మారపెల్లి సుధీర్కుమార్ను కేసీఆర్ ఎంపిక చేశారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారని.. మళ్లీ మోసం చేయాలనే చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న వారిని దగ్గరకు రానివ్వకుండా కోటరీ ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. పార్టీలో పదవులు మోసం చేసిన వారిని తొక్కిపెట్టాలన్నారు.
‘దళిత ద్రోహి, నయవంచకుడు, దుర్మార్గుడు కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా.. చూసుకుందాం’ అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. వర్ధన్నపేట దళితుల హక్కులను కాలరాసిన మోసకారి కడియం శ్రీహరి అన్నారు. కడియం శ్రీహరి బిడ్డ కావ్య కులంతోపాటు మతాన్ని సైతం అవమానపరుస్తోందన్నారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధిని అడ్డుకున్నాడని, సింగపూర్, మలేషియా దేశాల్లో ఆస్తులు కూడబెట్టాడని, కడియం శ్రీహరి జీవితమంతా ఎర్రబెల్లికి తెలుసని చెప్పారు. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్లో అవకాశం కల్పించని దుర్మార్గుడు సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కడియం, అరూరి పోవడంతో బీఆర్ఎస్కు శని పోయిందన్నారు. ఇప్పుడు ఉన్నవారంతా నిఖార్సయిన తెలంగాణవాదులు, ఉద్యమకారులేనని పేర్కొన్నారు. ఇక నుంచి స్టేషన్ఘన్పూర్కు ఏ ఎన్నిక వచ్చినా కడియంను చెడుగుడు ఆడుకునుడేనని రాజయ్య హెచ్చరించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి తప్పు చేశామని ప్రజలు, రైతులు బాధపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన కడియం, అరూరి ఒకే పుట్టలోని పాములే. కడియం కావ్య, అరూరి రమేశ్ ఇద్దరికీ కడియమే గురువు. తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నరు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనే జోష్ వచ్చింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదు. అబద్ధపు, మోసపూరిత హామీలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. సంస్థలకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డివిరుస్తోంది. ఇలాంటి పార్టీలను తిప్పికొట్టాలి. కేసీఆర్ పాలన అంతా రామరాజ్యం. అందరూ నన్ను దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలి.