ఐనవోలు, సెప్టెంబర్ 28 : ‘ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. సందర్భంగా గ్రామానికి వచ్చిన కడియం శ్రీహరికి ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ గ్రామ ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కడియం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం గ్రామం తనకు ఎంతో ఇష్టమైన గ్రామమని, ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన్నట్లుగా ఉంటుందన్నారు. గతంలో తాను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు తన వల్ల గ్రామానికి కానీ, గ్రామ ప్రజలకు ఎలాంటి తలవంపులు తేలేదన్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకు తన శక్తి మేరకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు మంజూరు చేసినట్లుగా గుర్తు చేశారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఉందని, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. ఎంతో మందికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించి, గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టి, అమలు చేయలేని పథకాలను ప్రజల్లోకి తీసుకురావాలని చూస్తున్నాయన్నారు. వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్లు గోనే రేణుక, గండి మల్లికాంబ, ఎంపీటీసీ పిండి మాధవి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ సంపత్కుమార్, ఉప సర్పంచ్ జ్యోతి, సొసైటీ చైర్మన్ రాంచంద్రయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు లడె రామారావు, నాయకులు రఘుపాల్రెడ్డి, విక్టర్, బాబు, శ్రీనివాస్, చంద్రశేఖర్, మహేందర్, దేవేందర్, సురేశ్, వెంకట్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 28: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోతుందని, అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఆగమవుతారని, తెలంగాణ రాకముందు పడిన కష్టాలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని శివునిపల్లిలో ఎంపీటీసీ బూర్ల లతాశంకర్ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ విధానం లేకుండా, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా హామీలు ఇస్తున్నదన్నారు. ఆ పార్టీని నమ్మితే మునిగిపోతారన్నారు. తెలంగాణ రాకముందు వ్యవసాయానికి కరెంటు, సాగు, తాగునీరు, పనులు లేక పస్తులుండలేక జీవనోపాధి కోసం వలస వెళ్లిన పరిస్థితిని ఆయన గుర్తు చేశారు. కానీ, తెలంగాణ సాధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నేడు 24 గంటల కరెంటు, సాగు, తాగునీరు, ఉపాధి కల్పిస్తూ తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులతో ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు అందిస్తూ, రైతులను రాజును చేశారని తెలిపారు. దీంతో వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చి సంతోషంగా జీవనం సాగిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు, అమలుకు నోచుకోని హామీలు ఇస్తూ గ్రామాల్లో ప్రచారం కోసం వచ్చే పార్టీలను తమ పాలనలో తెలంగాణకు ఏమి ఒరగబెట్టారో నిలదీయాలని పేర్కొన్నారు.
‘నియోజకవర్గ ప్రజలు ముప్పై ఏళ్లుగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఉపముఖ్యమంత్రిగా నన్ను నమ్మకంతో ఆశీర్వదించారు. ఆ నమ్మకాన్ని ఏనాడు వమ్ముకాకుండా నిజాయితీ, నిబద్ధతగా పనిచేశాను. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. మీరు కూడా ఆశీర్వదించి గెలిపించి సేవ చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలి’ అని ఎమ్మెల్సీ శ్రీహరి నియోజకవర్గ ప్రజలను కోరారు. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే రెండేళ్లలోపు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా అభివృద్ధిలో కడియం మార్క్ చూపిస్తానన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా కాపాడడమే కాకుండా, ఆ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానన్నారు. ఇటీవల నియోజకవర్గానికి 100 పడకల దవాఖాన మం జూరైందని, దానికి సొంత భవనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా కొంత అభివృద్ధి నిలిచిపోయిందని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేసుకుందామన్నారు. డివిజన్ కేంద్రంతోపాటు, చాగల్లు, శివునిపల్లి గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చి నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది చెంత నిలబెడతానన్నారు. సమావేశంలో వివిధ కుల సంఘాల నాయకులు, సభ్యులు ఎమ్మెల్సీ శ్రీహరిని సన్మానించారు. భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బెలిదె వెంకన్న, బూర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.