శాయంపేట, జూలై 9: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్రే ధైర్యమని, వర్షాలు కురవకున్నా కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కొప్పులలో రూ. 20.61 కోట్లతో పలు అభివృద్ధి పనులను వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. అలాగే, జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి వానకాలం సాగునీటిని విడుదల చేశారు. అనంతరం కొప్పులలో సర్పంచ్ గొలి మాధురీ మహేందర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మత రాజకీయం చేస్తున్న బీజేపీని ప్రజలే శాశ్వతంగా బహిష్కరిస్తారన్నారు. రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. బలహీన వర్గాలు, కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ప్రోత్సాహకాలను త్వరలోనే అందించనున్నామన్నారు.
గొల్లకురుమలకు వారం రోజుల్లో రెండో విడుత గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వరినాట్లను రైతులు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. మూలతాళ్ల నుంచి పరకాల వరకు రోడ్డు కోసం రూ. 15 కోట్లు అవసరమని సీఎం కేసీఆర్తో మాట్లాడానని, సానుకూలంగా స్పందించారన్నారు. గోరికొత్తపల్లి కొత్త మండలం కావడం వల్ల భూముల ధరలు పెరిగాయన్నారు. గోరికొత్తపల్లి నుంచి కొప్పుల మీదుగా పరకాల వరకు కొత్త రోడ్డుకు నిధుల కోసం ప్రయత్నిస్తానన్నారు. కొప్పులలో అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో ప్రారంభించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్కు టాయిలెట్స్, కిచెన్ షెడ్లు నిర్మాణానికి అదనంగా రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర ప్రకటించారు. చలివాగు ప్రాజెక్టు ఈ ప్రాంతానికి గుండెకాయ లాంటిదని, చిట్యాల వరకు నీళ్లు ఉంటాయన్నారు. ప్రాజెక్టు అభివృద్ధి పనుల టెండర్లు నాలుగు రోజుల్లో పూర్తయి పనులు ప్రారంభమవుతాయన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ మార్గదర్శకంగా ఉన్నారన్నారు. కొప్పులకు ఆర్టీసీ బస్సు నడిచేలా చర్యలు తీసుకుంటానన్నారు.
త్వరలోనే భూపాలపల్లికి సీఎం..
తెలంగాణ రాక ముందు.. తెలంగాణ వచ్చాక అనే అంశంపై ప్రజలందరూ ఆలోచించాలని జడ్పీచైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. త్వరలోనే భూపాలపల్లికి సీఎం కేసీఆర్ రానున్నట్లు తెలిపారు. ఆయన రాకతో అనేక అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ప్రతిపక్ష పార్టీలు నవ్వుకున్నాయన్నారు. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా నుంచి హైదరాబాద్ వరకు సాగు, తాగునీరు అందుతున్నదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రైతులకు సంక్షేమ పథకాలు అందించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులు వెచ్చిస్తున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో శాయంపేట మండలం నుంచి బీఆర్ఎస్కు అధిక మెజార్టీ అందించాలన్నారు.
అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు గండ్ర దంపతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాంశెట్టి లత, సర్పంచ్ గోలి మాధురీ మహేందర్రెడ్డి, ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, ఐబీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ గిరిధర్, పీఆర్ డీఈ లింగారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ చంద్రూనాయక్, ఎంపీటీసీలు మేకల శ్రీనివాస్, స్వాతి, మాచర్ల మంగమ్మ, వావిలాల వేణు, సర్పంచ్లు బొమ్మకంటి సాంబయ్య, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, అబ్బు ప్రకాశ్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, గ్రామ అధ్యక్షుడు సామల మధుసూదన్, మత్స్య సొసైటీ అధ్యక్షుడు గండి రాజమౌళి, నాయకులు రవీందర్, సుధాకర్ పాల్గొన్నారు.