వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నందుకు నిరసనగా ఈనెల 6న రైతు సంగ్రామ సదస్సు ( Rythu Sangrama Sadassu )ను నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ( Dasyam Vinay Bhasker ) వెల్లడించారు. హనుమకొండలోని హంటర్ రోడ్లో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆదివారం వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022 మే 6న వరంగల్లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పేరుతో రైతులకు హామీలు ఇచ్చారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు.
ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ మోసాన్ని బయటపెట్టడానికే నిర్వహిస్తున్న వరంగల్ రైతు సంగ్రామ సదస్సును విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని వెల్లడించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి రైతు ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.