ఓరుగల్లులో నేడు అభివృద్ధి ప్రదాత.. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. అమాత్యుడు రామన్న చేతులమీదుగా రూ.వెయ్యికోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను శుక్రవారం పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. హనుమకొండలో ఐటీ టవర్, రూ.100 కోట్లతో కొత్త బస్స్టేషన్కు భూమిపూజ చేయడంతో పాటు మడికొండలో క్వాడ్రెంట్ ఐటీ కంపెనీ, స్మార్ట్ సిటీ పనులు, డిజిటల్ లైబ్రరీ, తూర్పు నియోజవకర్గంలోని దూపకుంటలో డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బహిరంగ సభ, తూర్పు నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలో పాల్గొంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇబ్బడి ముబ్బడిగా ప్రగతి కార్యక్రమాలు ఉండగా ఆయాచోట్ల ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, సీపీ ఏవీ రంగనాథ్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా గురువారం పరిశీలించారు.
– వరంగల్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) /
వరంగల్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) /వరంగల్, (నమస్తే తెలంగాణ) : సంక్షేమ, అభివృద్ధి సర్కారు ఆధ్వర్యంలో వరంగల్ నగరం మరింత ప్రగతి సాధించేందుకు బాటలు పడుతున్నాయి. తొమ్మిదన్నరేండ్లుగా వరంగల్ మహానగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీ స్థాయిలో అభివృద్ధి పనులను చేపడుతున్నది. ఇందులో భాగంగా రూ.వెయ్యి కోట్లతో పూర్తయిన, కొత్తగా చేపడుతున్న పనులకు మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు రామన్న పర్యటనకు ఓరుగల్లు ముస్తాబైంది. ఆయనకు స్వాగతం పలుకుతూ రహదారులు, జంక్షన్లు, కూడళ్లలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. అడుగడుగునా బీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతుండటంతో నగరం గులాబీమయమైంది. నగరంలో వసతుల కల్పనతోపాటు ఐటీ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేలా భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు.
మడికొండలోని ఐటీ పార్కులో క్వాడ్రెంట్ ఐటీ కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. హనుమకొండలో కొత్తగా నిర్మించే ఐటీ టవర్కు భూమిపూజ చేస్తారు. హనుమకొండలో రూ.100 కోట్లతో నిర్మించే బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేశారు. స్మార్ట్ సిటీ పనులు, డిజిటల్ లైబ్రరీ, ఆరు జంక్షన్లను ప్రారంభిస్తారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభలో ప్రసంగిస్తారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దూపకుంటలో రూ.139 కోట్లతో నిర్మించిన 2200 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారు. ఖిలావరంగల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడే వాకింగ్ గ్రౌండ్లో సుమారు 60వేల మంది లబ్ధిదారులతో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడే 3వేల గృహలక్ష్మి, 4,100 దివ్యాంగ పింఛన్లు, 3వేల గుడిసెవాసుల పట్టాలు, వెయ్యి కల్యాణలక్ష్మి, 1100 దళితబంధు, 350 షాదిముబారక్, 200 మైనారిటీ బంధు, బీసీ బంధు, 381 మందికి పంట నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంప్ఆఫీస్ను సందర్శిస్తారు. సాయంత్రం వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ సమావేశంలో అధికారులతో కలిసి పాల్గొంటారు. ఆయాచోట్ల కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లోటు రాకుండా చూడాలని అధికారులతో సమీక్షలు నిర్వహించారు. సభలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
హనుమకొండ/ఖిలావరంగల్, అక్టోబర్ 5: వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజవర్గాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన, సభ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు గురువారం పరిశీలించారు. సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమంలో దాస్యం, తూర్పులో నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో సభలకు భారీ ఏర్పాట్లు చేశారు. తూర్పు నియోజకవర్గంలోని ఖిలావరంగల్ వాకింగ్ గ్రౌండ్లో 60 వేల మందితో సంక్షేమ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జపాన్ టెక్నాలజీతో సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. హనుమకొండ, వరంగల్ నగరాల్లో దారుల వెంట భారీ కటౌట్లు, గులాబీ జెండాలు కట్టారు. ‘థాంక్యూ కేసీఆర్ సార్’, ‘థాంక్యూ కేటీఆర్ సార్’ అంటూ ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్కు కనీవినీ ఎరుగని విధంగా స్వాగతం పలుకుతామని ఎమ్మెల్యేలు వివరించారు.
అధికారులు సమన్వయంతో పనిచేసి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ సూచించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని మున్సిపల్ గెస్ట్హౌస్లో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ఇతర లబ్ధిదారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను సందర్శించారు. హయగ్రీవాచారి మైదానంలో కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాసర్ తదితరులున్నారు.