హనుమకొండ, అక్టోబర్ 14 : నాలుగు చేతులు ఆడితేనే కడుపు నిండే రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో మా ఆయన ఒక్కడు చేస్తే ఎటు సరిపోయేది కాదు. మా ఆయన పెయింటర్గా పనిచేసేవారు. వచ్చే డబ్బులు సరిపోకపోయేది. మాకు సొంతి ఇల్లు లేదు.. కిరాయికే ఉంటున్నం. ఆయన పనిచేస్తేనే కుటుంబం గడవాలి. అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై వినయ్భాస్కర్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మాకు బీఆర్ఎస్ పార్టీ, వినయన్న ఆసరాగా ఉన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి కుట్టు మిషన్ ఇప్పించిండు. మొన్న మైనార్టీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయలు ఇప్పించారు. ఆ పైసలతోటి కిరాణం షాపు పెట్టుకున్నం. నేను ఇంట్లోనే ఉంటూ మిషన్ కుడుతున్నా. కిరాణం నడుపుకుంటున్నా. ఇప్పుడు ఆదాయం పెరిగింది. పిల్లలతో సంతోషంగా గడుపుతున్నాం. ఇదంతా వినయన్న, సీఎం కేసీఆర్ సార్ పుణ్యమే. మేము బతికి ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సార్ వెంటే ఉంటం.
– యాస్మిన్, కాపువాడ, హనుమకొండ
పాలకుర్తి రూరల్, అక్టోబర్ 14 : నాకు భర్త లేడు. నా తల్లిదండ్రులు కూడా దూరమయ్యారు. ఇద్దరు చిన్న పిల్లలు. నా పెళ్లి కాకముందే నా భర్త, అత్తామామలు దర్దేపల్లికి వచ్చి స్థిరపడ్డారు. అప్పటినుంచి మాకు దర్దేపల్లిలో సొంత ఇల్లు గానీ ఖాళీ జాగా కూడా లేదు. కిరాయికి ఉండేటోళ్లం. దురదృష్టవశాత్తు నా భర్త రవి జనవరి 6, 2018లో అనారోగ్యంతో చనిపోయిండు. అప్పటికి నా బిడ్డకు ఎనిమిది, కొడుకుకు రెండేళ్లు. మా అత్త కూడా పానం మంచిగ లేక మూడేళ్ల క్రితం చనిపోయింది. మాకు ఉందామంటే ఇల్లు లేదు. ఏం చేయాలో అర్థంకాకపోయేది. పిల్లలు చిన్నోళ్లు, కిరాయి ఉంటే వాళ్లు వెళ్లగొట్టారు. అప్పుడే మా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మా దర్దేపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించిండు. రెండేళ్ల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నా. లబ్ధిదారుల ఎంపిక జరగలేదు కానీ.. పేద కుటుంబమని గ్రామస్తులు, మా సర్పంచ్, ఎంపీటీసీ పెద్దలంతా కూడి డబుల్ బెడ్రూం ఇంట్లో ఉంచారు. మంత్రి దయాకర్రావు పుణ్యమా అని మొన్న మా గ్రామంలో 40మందికి బెడ్రూం ఇళ్లను డ్రా ద్వారా పంచారు. నాకు 13వ నెంబర్ ఇల్లు వచ్చింది. సొంతిల్లు వచ్చిన తర్వాత కొండంత ధైర్యం వచ్చింది. మొదటిసారి మా సొంత ఇంటిలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా పిల్లలు సంబురపడుతున్నారు. నాలాంటి ఎంతో మంది అభాగ్యులు, పేదల కష్టాలను గుర్తించి డబుల్ బెడ్రూంలు కట్టించిన సీఎం కేసీఆర్కు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావులకు రుణపడి ఉంటం.
– బానోత్ లీలమ్మ, దర్దేపల్లి
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ పుణ్యమా అని మాకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. భూపాలపల్లిలో ఎమ్మెల్యే రమణారెడ్డి పేదలను గుర్తించి పేర్లు రాయించారు. మా వాడకు సర్వేకు వచ్చి పేర్లు రాసుకుని పోయిన్రు. మాకు ఇల్లు వస్తదో, రాదో అనుకున్నం. 20ఏండ్ల కిందట నలుగురు ఆడపిల్లలు, ఒక కొడుకుతో బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి కూలీ పనిచేసుకుంట బతుకుతన్నం. అప్పటినుంచి కిరాయి ఇండ్లండ్లనే ఉంటానం. నేను కైకిలి పనికి పోత. నా భర్త బ్రాందీ షాపులో పనిచేస్తడు. వచ్చిన డబ్బులతో ఎట్లనో అట్ల ఇద్దరు బిడ్డల పెండ్లి చేసిన. ఎమ్మెల్యే రమణారెడ్డి మమ్మల్ని గుర్తించి డబుల్ ఇల్లిచ్చిండు. నెలకు రూ.4వేల కిరాయి తప్పినట్లయింది. ఈ పైసలు ఎనకేసుకుంటం. ఇంకా ఇద్దరి బిడ్డల పెండ్లి చేయాలె. కొత్త ఇంట్ల పనులు చేయించుకుంటన్నం. అచ్చే నెలల కొత్తింట్లకు పోతం. సీఎం కేసీఆర్కు, గండ్ర వెంకటరమణారెడ్డికి రుణపడి ఉంటం.
– గుడికందుల వెంకటలక్ష్మి, డబుల్బెడ్రూం లబ్ధిదారు, భూపాలపల్లి
హనుమకొండ, అక్టోబర్ 14 : మాది నిరుపేద యాదవ కుటుంబం. ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బర్ల ద్వారా వచ్చే పాలతో కుటుంబం గడుపుతానం. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు ఉన్నరు. పాలమ్ముకొనే బతికే మేము అసలు ఇల్లు కట్టుకుంటమో లేదో అని ఒకటే రంది ఉండేది. ఇంతల్నే సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకం పెట్టిండని తెల్సి సంబురపడ్డం. మాకు కూడా ఇల్లు వస్తదని సంబురపడ్డం. మేము అనుకున్నట్టే మాలాంటి పేదోళ్లకు కేసీఆర్ సర్కారు సాయం చేస్తదన్న నమ్మకంతోటి దరఖాస్తు చేసుకున్నం. ఆఫీసర్లు మా దరఖాస్తును పరిశీలించి గృహలక్ష్మికి ఎంపిక చేసిన్రు. మాకు మస్తు సంతోషం అయింది. సొంతిల్లు కోసం ఎన్నో ఏండ్ల సంది ఎదురుచూస్తున్న. ఇయ్యాల కేసీఆర్ పుణ్యమా అని అది నిజమయ్యే రోజు వచ్చింది. త్వరలోనే ఇంటి పనులు మొదలుపెడుతం. ఇదివరకున్న సర్కారోళ్లు మా అసోంటి పేదోళ్లను అస్సలు పట్టించుకోలేదు. తెలంగాణల బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సార్ అందరికీ మంచిగ చేస్తున్నడు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, ఆసరా పింఛన్, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు.. గిట్ల ఎన్నో పథకాలు పెట్టి ఆసరా అయితాండు. అందరి మేలు కోసం కేసీఆర్ ప్రభుత్వం పనిచేత్తాంది. మా కుటుంబం అంతా కేసీఆర్తోనే ఉంటం.
– వంగ సునీత, యాదవనగర్, హనుమకొండ
హనుమకొండ, అక్టోబర్ 14 : రోజూ కంకులు అమ్ముకుంటెనే ఇల్లు గడిచే కుటుంబం మాది. అలాంటి మాకు సీఎం కేసీఆర్ సారు ఆసరా అయిండు. పూట గడవని పరిస్థితుల్లో కేసీఆర్ ఇత్తున్న పింఛన్తోనే బతుకుతున్నం. నాకు నెలనెలా గాసానికి, మందులకు అయితానయ్. నాకు నలుగురు ఆడపిల్లలు. ఒక్క కొడుకు. చిన్న బిడ్డ జ్యోతి అవిటిది. మా ఆయన చనిపోయినప్పటి నుంచి పిల్లలను సాదుకుంటాన. ఇంకా చిన్న బిడ్డకు పెళ్లి కావాల్సి ఉన్నది. వికలాంగురాలని ఎవరూ ముందుకు వస్తలేరు. అయినా కేసీఆర్ సార్ ఇచ్చే పింఛన్తో నా బిడ్డ ధైర్యంగా బతుకుతాంది. తెలంగాణ రాక ముందు నాకు రూ.200లు, నా బిడ్డ జ్యోతికి రూ.500లు వికలాంగుల పింఛన్ వచ్చేది. అది ఎటూ సరిపోకపోయేది. తెలంగాణ అచ్చి కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినంక పేదోళ్లకు ఒక పెద్దకొడకు లెక్క ఆదుకుంటాండు. ఇప్పడు నాకు రూ.2016, బిడ్డకు రూ.4016లు వత్తానయ్. వీటితో మా కుటుంబం సంతోషంగా బతుకుతాంది. మళ్లా మాకు ఇచ్చే పింఛన్ సుత పెంచుతరట. ఆఫీసర్లకు నెలనెలా జీతం వచ్చినట్లు మాకు కూడా డబ్బులు టైమ్కు అందుతున్నాయ్. మాలాంటి కుటుంబాలన్ని సీఎం కేసీఆర్ సారు వెంబడే ఉంటయ్.
-పులి సరోజన, మచిలీబజార్, హనుమకొండ
నర్సంపేట, అక్టోబర్ 14: కేసీఆర్ సర్కారు ఇస్తున్న పింఛనే మాకు ఆసరా అయితాంది. బీడీ కార్మికులకు పింఛన్ అందించడం వల్ల ఎంతో మేలు కలుగుతున్నది. ఇంటి అవసరాలకు అక్కెరకు వస్తున్నది. రూ.2016లతో ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటున్న. సీఎం కేసీఆర్ బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వడం వల్ల నెలనెలా డబ్బులు అకౌంటులో పడుతున్నాయి. బీడీలు చుట్టి బతికే మాకు కేసీఆర్ పింఛన్ ఇచ్చి ఆదుకుకోవడం ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటా.
– షేక్ ఖాదర్బీ, నర్సంపేట
హనుమకొండ, అక్టోబర్ 14 : నాకు వచ్చే పింఛనే నా జీవితానికి ఆధారం అయ్యింది. మాది ధర్మసాగర్.. నాకు ఇద్దరు బిడ్డలు. నా భర్తకు, నాకు మధ్య మనస్పర్థలు వచ్చి 20 ఏళ్ల క్రితం పిల్లలతో హనుమకొండకు బతుకుదెరువు కోసం వచ్చాను. మచిలీబజార్లో ఉండి కూలి పనులు చేసుకొని పిల్లలను చదివించుకున్నా. వచ్చే డబ్బులు సరిపోక చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ సమయంలో కేసీఆర్ సార్ పింఛన్ ఇస్తుండని తెలిసి ఇక్కడి నాయకుని సహకారంతో దరఖాస్తు చేసుకున్నా. నాకు ఒంటరి మహిళ పింఛన్ మంజూరైంది. అప్పటి నుంచి నెలనెలా వస్తున్నది. ప్రస్తుతం నేను ఓ ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తున్నా. ఆ డబ్బులు, నెలనెలా వచ్చే పింఛన్తో కుటుంబమంతా సంతోషంగా ఉంటున్నాం. నా పెద్ద బిడ్డ పెళ్లి అప్పుడు కల్యాణలక్ష్మి పథకం ఆదుకున్నది. నాకు సొంత ఇల్లు లేదు. నాకు డబుల్ బెడ్రూం ఇప్పించాలని వేడుకుంటున్నా. మాలాంటి నిరుపేదలకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆసరా అవుతున్నాడు.
– కందకట్ల సులోచన, కాపువాడ, హనుమకొండ
వర్ధన్నపేట, అక్టోబర్ 14 : కేసీఆర్ సార్ ఇస్తున్న ఆసరా పింఛినే నాకు జీవనాధారం. నా భర్త శేఖరయ్య 30 ఏళ్ల కింద చనిపోయిండు. ఉన్న ఒక కొడుకు అనారోగ్యంతో ఏమీ పనిచేయలేడు. చిన్న రేకుల ఇల్లు ఒక్కటే ఉన్నది. నాకు ప్రతీ నెల కేసీఆర్ సార్ రెండు వేల పింఛన్ ఇస్తాండు. వాటితోనే బతుకుతున్నం. నా కొడుకుకు కూడా మందులు కొంట. ముసలితనంలో ఏమీ చేయలేకపోతాన. నాలుగైదేండ్ల కింద రోజు కూలికి పోయేదాన్ని. ఇప్పుడు చాతనైతలేదు. రేషన్ దుకాణ్ల నెలనెలా బియ్యం తీసుకుంట. కేసీఆర్ ఇచ్చే పింఛన్తోటి ఇంటి సామాన్లు కొనుక్కుంటాన. కేసీఆర్ పింఛన్ రాకపోతే నా బతుకు ఆగమయ్యేది. కేసీఆర్ సార్ సల్లగుండాలె. ఎవ్వలు ఎన్ని మాటలు చెప్పినా కేసీఆర్ దిక్కే ఉంట.
– శ్రీపాది సుశీల, ఇల్లంద
జనగామ చౌరస్తా, అక్టోబర్ 14 : మాది జనగామ పట్టణ కేంద్రంలోని జయశంకర్ కాలనీ. నేను 35 ఏళ్ల నుంచి బీడీ కార్మికురాలిగా పనిచేస్తున్నా. వచ్చే కూలి డబ్బులతో భార్యాభర్తలిద్దరం పూట గడుపుతున్నాం. మాకు ఒక్క కూతురు. పెళ్లి చేసి అత్తారింటికి పంపినం. మొదట్లో రోజుకు వెయ్యి బీడీలు సుడితే పదిహేను రూపాల కూలి వచ్చేది. నిన్నియ్యాల నూటా యాభై ఇస్తండ్లు. చాతనై చాతగాక నెలలో పదిహేను దినాలు కష్టపడితే రెండు వేలు వొస్తున్నయ్. వాటితోటి పూట గడవడం ఇబ్బందిగా ఉండి ఎక్కువ రోజులు పచ్చడి మెతుకులే తినేది. కేసీఆర్ సార్ వచ్చినంక మా కష్టాలు గుర్తించిండు. నెలకు రూ.2016లు పింఛన్ ఇస్తుండు. ఇప్పుడు నా రెక్కల కష్టానికి తోడు కేసీఆర్ ఇచ్చే పింఛనే ఆసరైంది. రోజూ కారం మెతుకులు తినే మేము ఇయ్యాల పప్పన్నం తింటున్నామంటే అదంతా సీఎం కేసీఆర్ సార్ పుణ్యమే. నిలువ నీడ లేక, పూట గడువ లేనోళ్లకు ఆ దేవుడే దిక్కంటరు. మాకైతే కేసీఆరే దేవుడు. అందుకే ఆయన సల్లగుండాలె.
– కడవేర్గు యశోద, బీడీ కార్మికురాలు, జనగామ