బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు సన్నద్ధమవుతోంది. అధిష్టానం ఆదేశించడంతో గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల ఇన్చార్జి ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావుతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. షెడ్యూల్ను త్వరలోనే ఖరారు చేసుకోవాలని, సమ్మేళనాల్లో సీఎం కేసీఆర్ సందేశాన్ని కార్యకర్తలందరికీ చేరవేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి నిరుపేదలపై భారం వేయడంపై వివరించాలని సూచించారు.
– వరంగల్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినాయకత్వం ఆదేశం మేరకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిల వారీగా నిర్వహించనున్న సదస్సుల షెడ్యూల్ ఖరారు చేసుకుని, దాని ప్రకారం ముందుకెళ్లాలని చెప్పారు.
ఆత్మీయ సమ్మేళనాలు, వాటి ఏర్పాట్లపై హనుమకొండ, వరంగల్ జిల్లాల బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావుతో కలిసి రెండు జిల్లాల ముఖ్య ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాల్లో సీఎం కేసీఆర్ సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరవేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల తీరును అందరికీ వివరించాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయాలని సూచించారు.
మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను వివరించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే దేవుళ్లని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని చెప్పారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, వొడితెల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.