స్టేషన్ఘన్పూర్/జఫర్గఢ్/చిల్పూరు, అక్టోబర్ 28 : స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కంచుకోట అని.. ఇక్కడ ఎగిరేది గులాబీ జెండానేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో స్టేషన్ఘన్పూర్లో శనివారం సాయంత్రం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం ఎట్లుండేది.. ఇప్పుడెలా ఉందో ఆలోచించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి కలిసిపోయి ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.
గులాబీ పార్టీకి స్టేషన్ఘన్పూర్ కంచుకోట లాంటిదని, కడియం, ఎమ్మెల్యే రాజయ్య ఇద్దరు కలిసిపోయి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. స్టేషన్ఘన్పూర్లో శనివారం సాయంత్రం బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘స్టేషన్ఘన్పూర్లో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందున్నది. ఒకనాడు కరువు విళయ తాండవం చేసిన ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చి సస్యశ్యామలం చేసిన బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని’ ప్రజలను కోరారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని, దళితబంధు ఇస్తామని, జాగ ఉన్న వారికి గృహలక్ష్మి కింద ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో లేనివాటిని కూడా అమలు చేసిందని గుర్తుచేశారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, పగటి పూట పది గంటల కరెంటు ఇస్తామని చెప్పి 5 గంటలు కూడా ఇవ్వలేదని, ప్రతి మనిషికి 6కిలోల బియ్యం ఇస్తామని, ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిన కాంగ్రెస్, ఒక్కదానికి కూడా నెరవేర్చలేదన్నారు. కానీ, బీఆర్ఎస్ మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నారు. రాదనుకున్న తెలంగాణను సాధించిందని, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక పథకాలను అమలు చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజయ్యకు, ఆయన అనుచరులకు రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరూ అనుభవం ఉన్నవారని, ఇద్దరూ పార్టీకి ముఖ్యమేనని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని, కడియం గెలుపు కోసం రాజయ్య, ఆయన అనుచరులు కృషి చేయాలని కోరారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆత్మీయ సమావేశంలో కళాకారుల ఆట, పాటలు అలరించాయి. కళాకారులు కడియం శ్రీహరిపై పాడిన పాటకు స్పందించిన గొల్ల కురుమ వృద్ధుడు గొంగడితో గులాబీ జెండాతో వచ్చి నృత్యం చేసి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచాడు.
బీఆర్ఎస్లోకి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చేపూరి వినోద్
స్టేషన్ఘన్పూర్ మండలం చాగల్లుకు చెందిన పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చేపూరి వినోద్ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, బీఆర్ఎస్ నాయకుడు స్వామిగౌడ్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జడ్పీటీసీలు ఇల్లందుల బేబీ శ్రీనివాస్, గుడి వంశీధర్రెడ్డి, పిట్టల సరిత, ఎంపీపీలు కందుల రేఖా గట్టయ్య, నిమ్మ కవిత, చిట్ల జయశ్రీ, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి మండలాల అధ్యక్షులు మాచర్ల గణేశ్, వారాల రమేశ్, మాజీ మార్కెట్ చైర్మన్లు చింతకుంట్ల నరేందర్రెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, గట్టు రమేశ్, బూర్ల శంకర్, పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, పెసరు రమేశ్, ఇల్లందుల ప్రతాప్, రజాక్ యాదవ్, గన్ను నర్సింహులు, గుర్రం రాజు, తోట సత్యం, తెల్లాకుల రామకృష్ణ, ఎల్మకంటి నాగరాజు, కడియం యువసేన సభ్యులు జీడి ప్రసాద్, ఇల్లందుల విజయ్, హఫిస్, సంపత్రాజ్, మేకల శ్రీకాంత్, కొర్ర వెంకటేశ్ పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటా ; ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలతోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉంది. నన్ను పలుమార్లు గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు రుణపడి ఉంటా. ఈ ఎన్నికల్లో మరోసారి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే రానున్న ఐదేళ్లలో మీకు సేవకుడిగా ఉంటూ మిమ్మల్ని కాపాడుకుంటా. ఈ నియోజకవర్గానికి దళితబంధు 1100 యూనిట్లు, గృహలక్ష్మి పథకంలో మూడు వేల ఇళ్లు మంజూరయ్యాయి. నేను గెలిచాక దళితబంధు పథకంలో మరో 1000 యూనిట్లతోపాటు మూడు వేల డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరుతా. నేను, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుకుని అర్హులైన లబ్ధిదారులకు వీటిని అందజేస్తాం.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి హాజరైన మంత్రి హరీశ్రావు, అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాజయ్య నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా..; ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రిజర్వాయర్ల హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాం. ఫైర్ స్టేషన్, డిగ్రీ కళాశాల, డయాలసిస్ ఏర్పాటు చేసుకున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల దవాఖాన మంజూరైంది. గతంలో నా గెలుపునకు కడియం శ్రీహరి సహకరించారు. ఇప్పుడు కడియం గెలుపు కోసం నా అనుచరులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా.
బీఆర్ఎస్ పాలనలోనే భూముల విలువ పెరిగింది ; మంత్రి ఎర్రబెల్లి
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిదేవాదుల ద్వారా గోదావరి జలాలు తరలివచ్చాయి. రెండు పంటలకు సాగునీరు అందుతున్నది. సాగు విస్తీర్ణం పెరిగింది. భూముల విలువ పెరిగింది. దేవాదుల పథకాన్ని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు పట్టుబట్టి పూర్తి చేయించారు. ఎన్నికల్లో కడియం శ్రీహరి గెలుపునకు ఎమ్మెల్యే రాజయ్య ముందుండి పనిచేస్తానని చెప్పారు. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య సమన్వయంతో ముందుకెళ్తారు.
కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించాలి ; మంత్రి సత్యవతి రాథోడ్
స్టేషన్ఘన్పూర్ అభ్యర్థి కడియం శ్రీహరిని ఉమ్మడి జిల్లాలోనే ఎవరూ ఊహంచని భారీ మెజార్టీతో గెలిపించాలి. రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరి నాకు గురుతుల్యులు. నియోజకవర్గాన్ని ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు ఐక్యంగా నిలిచి అభివృద్ధిలో ముందుంచుతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలు కాని హామీలిస్తూ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్వన్గా నిలిపారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలి.