డోర్నకల్, మే 9 : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక మాలోత్ కవితను గెలిపించాలని, స్వార్థం కోసం పార్టీలు మారే వారికి ఓటుతో బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గురువారం డోర్నకల్లో మహబూబాబాద్ అభ్యర్థి మాలోత్ కవితతో కలి సి ఆమె రోడ్షో నిర్వహించారు. పెట్రోల్బంక్ నుంచి రైల్వేస్టేషన్ వరకు సాగిన ప్రచార కార్యక్రమంలో వెయ్యి మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని జై కేసీఆర్, జై కవితమ్మ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ జెండాలతో పట్టణ రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి.
మాలోత్ కవితను లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీవించి పంపారని, మీరంతా ఆశీర్వదించి పట్టంకట్టాలని సత్యవతి కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీల నాయకులు వస్తారని, కానీ ఎవరు సేవ చేస్తారో ఆలోచించి వారికే ఓటు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో డోర్నకల్లో అన్ని విధాలా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఆసరా పింఛన్ రూ.2016, పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందించామని గుర్తుచేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, ఎన్నో ఏళ్ల తర్వాత మున్నేరు వాగు ఎండిపోయిందని, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా దేవుళ్ల మీద రేవంత్రెడ్డి ఒట్టు వేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రైతులకు బోనస్ ఇవ్వలేదని మండిపడ్డారు.
మళ్లీ ఇప్పుడు ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి దొంగ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. డోర్నకల్ ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందన్నారు. మహబూబాబాద్కు రేవంత్రెడ్డి వస్తే ప్రజలే రాలేదని, గంట సేపు బస్సులో ఉన్నారని.. కానీ కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహిస్తే రోడ్లు దద్దరిల్లిపోయాయని చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ధరంసోత్ బాలూ నాయక్, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కత్తెరసాల విద్యాసాగర్, పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, వైస్ ఎంపీపీ తుమ్మ వెంకటరెడ్డి, వార్డు కౌన్సిలర్లు పోటు జనార్దన్, బోరగల్ల శరత్బాబు, కొండేటి హేమచంద్ర శేఖర్, కాలా మౌనికా జైన్, కొత్త రాధిక, కందుల అరుణ, తేజావత్ సంధ్యారాణి, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కళ్లెపు సతీశ్ కుమార్గౌడ్, మండల కో ఆప్షన్ షేక్ లాలూమియా, మాజీ సర్పంచ్లు గుగులోత్ శ్రీనివాస్, బోయినపల్లి వెంకన్న, ఎంపీటీసీ బానోత్ శంకర్ కోటి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రాంభద్రం, అజిత్మియా, బీఆర్ఎస్ నాయకులు మాన్యు పాట్ని, కాలా యశోధర్ జైన్, కొత్త వీరన్న, తేజావత్ రమేశ్, కందుల మధు, చంటి, గౌస్, కొత్త కుమార్, జాల రమేశ్, రహీం, విక్కీ, గణేశ్ ఠాగూర్ పాల్గొన్నారు.
‘నేను డోర్నకల్ ఆడబిడ్డను.. పక్కా లోకల్’ అని అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ ప్రజలకు సేవలు అందించానని చెప్పారు. కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేస్తున్నదని, త్వరలో ఆ పార్టీని రైతులే బొందపెడ్తరని పేర్కొన్నారు. గ్యారెంటీల పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదన్నారు. కాంగ్రెసోళ్లు దేవుళ్ల మీద ఒట్టు వేస్తే, బీజేపోళ్లు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వర జలాలలో చెరువులు, కుంటలను నింపడం వల్ల చివరి ఆయకట్టు వరకు ఒక్క పొలం కూడా ఎండిపోలేదన్నారు. కేసీఆర్ యువతకు ఉద్యోగాలు కల్పించారని, అందుకే యువత అందరూ బీఆర్ఎస్ వెంట ఉన్నారని పేర్కొన్నారు. మీ ఆశీస్సులు ఉండాలని కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.