ఏకారణం చేతనైనా కుటుంబంలో ఎవరైనా ‘దూరమైతే’ ఆ ఇంటిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ అమలు చేస్తామంటున్న ‘కేసీఆర్ బీమా’పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తామని పేర్కొనడం పేదల్లో భరోసా నింపుతున్నది. గులాబీ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలకూ మద్దతు వెల్లువెత్తుతున్నది. ముఖ్యంగా రూ.400కే గ్యాస్ సిలిండర్ అందితే పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం కొంతైనా తగ్గుతుందనే సంతోషం వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో పేదల సంక్షేమమే లక్ష్యంగా ఉందని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వరంగల్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వరంగల్, (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా కేసీఆర్ బీమాపై పేద, మధ్యతరగతి ప్రజల్లో భరోసా కనిపిస్తున్నది. రూ.400కే గ్యాస్ సిలిండర్ వస్తే ఆర్థిక భారం తగ్గుతుందనే అభిప్రాయాలు వినిపిస్తునాయి.
రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు బీమా’ ఎంతో ఆర్థిక ధీమాను ఇస్తోంది. 18 నుంచి 59 ఏళ్ల రైతులు ఈ పథకానికి అర్హులు కాగా, రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వమే ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)కు ప్రీమియం చెల్లిస్తోంది. ఈ పథకంలో చేరిన రైతులు ఏ కారణం చేత మృతిచెందినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. అది కూడా వారం, పది రోజుల్లోనే ఎలాంటి పైరవీలు లేకుండా రైతు భాగస్వామి(నామినీ) లేదా కుటుంబీకుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తోంది.
రైతుబీమా తరహాలోనే కేసీఆర్ బీమాను అమలు చేస్తామని ప్రకటించింది. తెల్ల రేషన్కార్డు ఉన్న కుటుంబంలో ఎందరు 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య ఉంటారో వారందరూ బీమా పరిధిలోకి వస్తారని చెబుతున్నారు. మరికొన్ని పాలసీల్లో చిన్న పిల్లలను సైతం పరిధిలోకి తెచ్చే అవకాశాలున్నాయని, అయితే ప్రభుత్వం రైతు బీమాకు సంబంధించి పాటిస్తున్న పద్ధతిలో 18-59 మధ్య వయస్సు వారికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడు పెట్రో, గ్యాస్ ధరలు పెరగడం పరిపాటిగా మారింది. ఇక నుంచి అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా అర్హులైన నిరుపేదలు, అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్ట్ కుటుంబాలకు కేవలం రూ. 400కే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడంపై ప్రజలు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వంటగ్యాస్ ధర రూ.974 ఉండగా డెలివరీతో కలిపి రూ. వెయ్యి చెల్లించాల్సి వస్తోంది. ఇక మీదట లబ్ధిదారులు అంత చెల్లించాల్సిన అవసరం ఉండదు. నెల క్రితం వరకు వంటగ్యాస్ ధర రూ.1,200 దాకా ఉండేది. గతనెలలో కేంద్రం ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్పై రూ.200 తగ్గించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందించనుంది.
మహబూబాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : కష్టకాలంలో సీఎం కేసీఆరే మా కుటుంబానికి పెద్ద దిక్కయ్యిండు. రైతుబీమా ఇచ్చి అన్ని విధాలా ఆదుకున్నడు. మాది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామం. మా ఆయన పేరు జంపాల వెంకటేశ్వర్లు. మాకు అర ఎకరం పొలం ఉంది. ఏటా వానకాలం, యాసంగిలో రైతుబంధు డబ్బులు పడుతున్నయ్. మా ఆయన 2019 జనవరి 6న అనారోగ్యంతో చనిపోయిండు. అప్పుడు కేసీఆర్ సర్కారు తెచ్చిన రైతుబీమా కొండంత భరోసా ఇచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులకు అన్ని వివరాలు ఇచ్చాను. 10 రోజుల్లోపు నా బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమైనయ్. నాకు కూతురు మౌనిక, కుమారుడు ముఖేష్ ఉన్నారు. రైతుబీమా కింద వచ్చిన రూ.5లక్షల్లో రూ.4లక్షలు పెట్టి కూతురు పెళ్లి చేసిన. మిగిలిన లక్షతో నా కొడుకు ముఖేష్ మా ఊళ్లో వెంకటేశ్వర సెలూన్స్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత కల్యాణలక్ష్మి ద్వారా కూడ రూ.లక్ష వచ్చాయి. ఇలా సీఎం కేసీఆర్ ఇచ్చిన రైతుబీమా డబ్బులతో మా కుటుంబానికి ఎంతో భరోసా దొరికింది. కష్టకాలంలో కేసీఆర్ సర్కారు ఆదుకోకుంటే మా కుటుంబం రోడ్డున పడేది. సీఎం మాలాంటి పేదల కోసం పెద్దమనసుతో పెట్టిన ఈ పథకాల వల్లే ఇంత మేలు జరిగింది. లేదంటే డబ్బుల కోసం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం. సీఎం కేసీఆర్ మేలును జీవితంలో మరువం.
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : నా భర్త రమేశ్ ఏడాదిన్నర కిందట గుండెపోటచ్చి చనిపోయిండు. నాకు నలుగురు బిడ్డలు. ఒక కొడుకు. నా భర్త బతికుండంగ ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు పెండ్లి చేసిండు. ఇంకా ఇద్దరు బిడ్డల పెండ్లి సేసే పని నాకప్పజెప్పి పోయిండు. నాకు ఏం చేయాన్నో అర్థంకాలే. ఉన్న ఎకరం భూమి. ఇద్దరు బిడ్డల పెండ్లెట్ల సెయ్యాలె. నా భర్త సనిపోయి పదకొండొద్దులు ఎల్లలే. ఇంతల్నే కేసీఆర్ బీమా పైసలు ఐదు లచ్చలు అచ్చినయ్. శాన ధైర్యం అచ్చింది. భర్త పోయిన బాధ ఒక దిక్కు, బిడ్డ పెండ్లికి పైసలు అందిన దైర్యం ఒక దిక్కు. కేసీఆర్ డబ్బులతో ఒక బిడ్డ పెండ్లి సేసిన. మాకున్న ఎకరం భూమిని పసువు కుంకుమల కింద ఇచ్చి ఇంకో బిడ్డ పెండ్లి చేసిన. కేసీఆర్ పుణ్యం అని తలమీది భారం దించుకున్న. కేసీఆర్ బీమా పైసలు రాకపోతే నా బతుకు ఎట్లుండునో. తలుసుకుంటేనే భయమైతుంది. కేసీఆర్ సారుకు మా కుటుంబమంత రుణపడి ఉంటం. అచ్చిన పింఛన్తోటి, ఇంటి కాడ పెట్టుకున్న దుకాణంతోటి బతుకుతన్న. మా ఊళ్లె నాలాంటోళ్లు సానా మందికి కేసీఆర్ బీమా పైసలు అచ్చినయ్. అందరు సంతోషంగా ఉన్నరు.
కాటారం, అక్టోబర్ 21 : గా మోడీ సర్కారు గ్యాస్ సిలిండర్ను మూడొందల నుంచి వెయ్యి దాటిచ్చిండు. గన్ని పైసలు పెట్టి కొనేటట్టు లేదాయె. నాలాంటి ఎంతోమంది పేదలకు ఎట్ల ఉంటది. బీజేపీ సర్కారు గ్యాస్ రేటు పదిమాట్ల పెంచుకుంట పోయింది. గన్ని పైసలు పెట్టి గ్యాస్ తెచ్చుకొనే పరిస్థితి లేక మల్ల పాత రోజుల లెక్కనే అడవిలోకి పోయి కట్టెలు తెచ్చుకొని పొయ్యి ఎలిగించి వంటలు చేసుకుంటన్నం. గీ పరిస్థితికి మోడీ సర్కారే కారణం. అరె గిన్ని సార్లు గ్యాస్ రేట్లు పెంచుతర ఎక్కడన్న… పుణ్యాత్ముడు సీఎం కేసీఆర్ మల్ల అత్తె… గ్యాస్ను 400లకే ఇత్తం అంటండు. గందుకే కేసీఆర్ సారె మల్ల రావాలె. నా గీ తిప్పలు పోవాలె. కట్టెల పొయ్యి కాడ గంటల కమాన కూసునుడు నాతోటి ఐతలేదు. తెలంగాణ సర్కారు అచ్చినంక ఎన్నో మంచి పనులు చేత్తాంది. మా ఆడోళ్లు శాన సంబుర పడుతాండ్రు. మళ్ల కేసీఆర్ సారునే గెలిపించుకుంటం.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రైవేటీకరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఎల్ఐసీకి, రాష్ట్ర ప్రభుత్వం ఊరట అందిస్తూనే వస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు గ్రూప్ పాలసీలను చెల్లిస్తూ ఎల్ఐసీ మనుగడ, ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్న సర్కారు, మరోసారి ఆ సంస్థకు భారీ అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకు గ్రూప్ పాలసీని ఎల్ఐసీ పరిధిలో తీసుకుంటే ఆ సంస్థను ప్రతి ఇంటికి తీసుకువెళ్లడం ద్వారా కుటుంబంలో మిగిలిన సభ్యుల నుంచి పాలసీలు తీసుకునేలా ప్రయోజనం అత్యధికంగా ఉంటుందని ఆ సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీ సంస్థకు పెద్దదిక్కుగా మారిందని, రానున్న రోజుల్లో కోటికి పైగా గ్రూప్ పాలసీలు అమల్లోకి వస్తే అతిపెద్ద బీమా సంస్థగా ఎల్ఐసీ రికార్డులోకి ఎక్కుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంగపేట అక్టోబర్ 21 : నాలుగు వందలకే వంట గ్యాస్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పడం సంతోషంగా ఉంది. విపరీతంగా పెరిగిన వంట గ్యాస్ ధర వల్ల మాలాంటి పేదోళ్లు చానా ఇబ్బంది పడుతున్నరు. ప్రతి నెల వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండరు కొనాలంటే చానా కష్టమైతాంది. అడవిలో ఇదివరకటి లెక్క కట్టెలు కూడా దొరుకుతలేవు. గ్యాసు రేటు పెరుగుట్ల కొనుడు చానా ఇబ్బందైతాంది. మాలాంటి పేదల కష్టాలను అర్థం చేసుకొని రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తే ఎంతో మేలైతది. మళ్ల కేసీఆర్ సర్కారే రావాలె.
చెన్నారావుపేట, అక్టోబర్ 21 : కుటుంబ యజమాని చనిపోయిన తర్వాత కేసీఆర్ సర్కారు రైతుబీమా కింద ఇచ్చిన రూ.5 లక్షలు మా కుటుంబానికి ఎంతో ఆసరా అయినయ్. మా కొడుకును మంచిగ చదివించాలనుకున్నం. చాయ దుకాణం పెట్టి బతుకుతున్న సమయంలో మా ఆయన హఠాత్తుగా చనిపోయిండు. ఒక్కసారిగా అందరం ఆగమైనమ్. మాకు కొద్ది భూమి ఉండడం వల్ల రైతుబీమా డబ్బులు వచ్చినయ్. కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన రైతుబీమా నగదుతో మా కొడుకును ఇంజినీరింగ్ చదివించిన. పెద్ద చదువులు చదివించాలనే మా ఆయన కోరిక తీరింది. మా కొడుకు పోలీస్ ఉద్యోగం కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాడు. ఉద్యోగం రాకపోవడంతో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. భవిష్యత్లో నా కొడుకు ఏదో ఒక ఉద్యోగం చేసి నన్ను పోషిస్తాడనే నమ్మకం ఉంది. ఇప్పుడు నేను చాయ దుకాణం నడుపూతూ బతుకుతున్నాను. నా భర్త చనిపోయిన సమయంలో గవర్నమెంట్ రూ.5 లక్షలు ఇవ్వకపోతే చాలా కష్టమయ్యేది. రైతుబీమా పథకం పెట్టడం వల్లే మాకు మేలైంది.
పొద్దంతా కేవలం రెక్కల కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తే తప్ప ఓ పేద కుటుంబానికి రోజు గడవదు. ఉన్నంతలో పిల్లల చదువు, ఇతర అవసరాలు, మూడు పూటలా కడుపు నిండా బువ్వ దొరికి నలుగురిలో నిలబడగలుగుతుంది. కానీ విధి వక్రీకరించి ఆ ఇంటి పెద్దకు అనుకోకుండా జరగరానిది ఏమైనా జరిగితే ఆ ఇల్లు ఆగమై రోడ్డున పడుతుంది. అప్పటదాకా ఎవరికీ తీసిపోకుండా ఓ మాదిరిగా బతికిన ఏ కుటుంబమైనా..ఇంటి పెద్దను కోల్పోతే ఏ ఆధారం లేక.. ఆదుకునేవాళ్లు లేక దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుంది. ఆర్థికంగా కుటుంబాలు ఒడిదొడుకులకు లోనై వైకుంఠపాళిలో పాము మింగినట్లు పాతాళానికి పడిపోతుంది. ఇలాంటి కుటుంబాలకు ఆర్థిక అండను కల్పించి ‘మేమున్నా’మంటూ ఓ ధైర్యాన్ని ఇచ్చేందుకు బీఆర్ఎస్ విప్లవాత్మకమైన ఎన్నికల మ్యానిఫెస్టోను తెచ్చిది గతంలో ప్రజలకు అవసరమైన పథకాలు..అడగని పథకాలను సైతం అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రలోని పేదలందరికీ రైతు బీమా తరహా ‘కేసీఆర్ బీమా..ప్రతి ఇంటికి దీమా’ పేరిట అమలు చేసేందుకు మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. తెల్లరేషన్కార్డు కలిగి ఉన్న వ్యక్తి ఏ కారణంతో చనిపోయినా కుటుంబానికి రూ.5లక్షల బీమా వర్తింపజేసేందుకు సిద్ధమైంది.
జనగామ చౌరస్తా, అక్టోబర్ 21 : మాది జనగాం. నా భర్త ఎల్లయ్య, నేను నిన్నియ్యాల కూరగాయలు అమ్ముకుంటున్నం. నాకు యాభై ఏండ్లుంటయ్. ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. మా తాయికి తగ్గట్టు అందరి పెళ్లిళ్లు చేసినం. మా ఆయినెకు పతి నెలా కేసీఆర్ సార్ ఇచ్చే పించిని వొత్తాంది. రేషన్ షాపుల ఇచ్చే బియ్యం తిని బతుకుతున్నం. మాకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. రెక్కాడితేనే డొక్కడుతుంది. గాశారం కొద్ది ఏమన్న అయితే కుటుంబం ఆగమైతది. అట్ల కావొద్దని కేసీఆర్ సారు అయిదు లచ్చల బీమా ఇస్తనంటుండు. ఇసొంటి పథకం పేదోళ్లకు మంచిదే కదా. ఆడోళ్లకు నెలకు మూడు వేలు ఖాతాలేస్తనంటుండు. నాలుగొందలకే వంట గ్యాస్ కూడా ఇస్తనంటుండు. పేదోనికి ఇంతకంటే ఇంకేం కావాలె. మంచిగ చూసుకునే కేసీఆర్ ఉన్నన్ని రోజులు కంటినిండ కునుకు తీయొచ్చు. మేం మళ్ల కేసీఆర్ కారు గుర్తుకే ఓటేస్తం. మా సుట్టుపక్కలొళ్లను కూడా కేసీఆర్ సారుకే ఓటెయ్యాలని జెప్తం.
పరకాల, అక్టోబర్ 21: మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతి ఒక్కటీ చేస్తడు. మాకు ఆ నమ్మకముంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంల నాలాంటి పేదోళ్ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి అమలుచేస్తున్నడు. నాలుగు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తనని చెప్పిండు. మాకు మస్తు సంతోషం అనిపించింది. అట్ల చేస్తే పేద కుటుంబాలకు కొంచెం బరువు దిగుతది. కేంద్రంల ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరను ఘోరంగా పెంచింది. గిట్ల పెంచుకుంట పోతే నాలాంటి ఎంతోమంది పేద కుటుంబాల ప్రజలు మళ్ల కట్టెలతోనే ఇంట్లో వంట చేసుకుంటున్నాం. కానీ సీఎం కేసీఆర్ 400 రూపాయలకే గ్యాస్ ఇత్తనని చెప్పినంక సంతోషం అనిపించింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఎన్నో పథకాలు సీఎం కేసీఆర్ ముందుగా చెప్పకపోయినా చేస్తాండు. అట్లాంటిది కేసీఆర్ చెప్పిండంటే తప్పకుంట చేస్తడు. మళ్ల అచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా! కేసీఆరే ముఖ్యమంత్రి. సీఎం చెప్పిన అన్ని హామీలు అమలు చేస్తాడనే నమ్మకముంది.