బీఆర్ఎస్ దూకుడు పెంచింది. వరుసగా చేపట్టబోయే పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఆయా జిల్లాల మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాల విజయవంతం కోసం వీరు పనిచేయనున్నారు.
వరంగల్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితి వరుసగా చేపట్టనున్న పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మూడు, నాలుగు నెలలపాటు బీఆర్ఎస్ విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నది.
ఆత్మీయ సమ్మేళనాలు, బీ అర్.అంబేదర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, నియోజకవర్గ ప్రతినిధుల సభ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను వరుసగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆయా కార్యక్రమాల కోసం పార్టీ పరంగా రాష్ట్ర స్థాయిలో బృందాలను నియమించారు. ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు జిల్లాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయా జిల్లాల మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో వీరు సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేసేలా పని చేయనున్నారు. వరుసగా కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో జిల్లాల వారీగా మంత్రులు, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో ఇన్చార్జిలు సమావేశమై కార్యక్రమాల షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు.
బీఆర్ఎస్ జిల్లాల ఇన్చార్జిలు వీరే..
హనుమకొండ, వరంగల్ : ఎమ్మెల్సీ ఎమ్.ఎస్.ప్రభాకర్
జనగామ : ఎమ్మెల్సీ కోటిరెడ్డి
మహబూబాబాద్ : మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్
భూపాలపల్లి, ములుగు : మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి