ఎల్కతుర్తి, ఏప్రిల్ 19 : పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతుక వినిపించేది కేవలం బీఆర్ఎస్సే అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, ఇప్పుడు మన పిల్లల కోసం పార్లమెంట్లో తమ గొంతుక వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీలుగా ఉండాలన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఎల్కతుర్తి మీదుగా జాతీయ రహదారిని మంజూరు చేయించానని గుర్తు చేశారు. కృష్ణ, గోదావరి నదులపై నిర్మించిన అనేక సాగునీటి ప్రాజెక్టుల అనుమతి కోసం కేసీఆర్ సూచన మేరకు కృషి చేశానని తెలిపారు. కరీంనగర్ సిటీ అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు తెచ్చానని చెప్పారు. 9వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అనుమతులు తీసుకొచ్చినట్లు వివరించారు. అలాగే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు రైలు మార్గం కోసం కృషి చేశానన్నారు. 75ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో పేదవాడికి, ధనికుడికి అంతరం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదన్నారు. అదానీ, అంబానీల అస్తులు పెరుగుతుంటే పేదవాడు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదవారి అకౌంట్లలో రూ. 15లక్షలు వేస్తానన్న మోదీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విజయ్మాల్యా, నీరవ్మోదీలు లండన్లో దాక్కుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ కేసులతో విపక్షాలను లొంగదీసుకోవాలని చూస్తున్నదని, సుజనాచౌదరి రూ. 800 కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడి బీజేపీలో చేరితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మళ్లీ ఎంపీగా టికెట్ ఇవ్వడం విచారకరమని చెప్పారు. ఈ రెండు పార్టీలు తెలంగాణకు చేసింది శూన్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అబద్ధాల పునాదుల మీదే ఏర్పడిందని, ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. మేడిగడ్డ కింద 5వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. రైతులు బాగుపడడం కాంగ్రెస్కు ఇష్టం లేదని, అందుకే దేవాదుల నుంచి నీటిని పంపింగ్ చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికల హామీలో రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని, రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారని, ఆ హామీ ఏమైందన్నారు. ఇప్పుడు ఆగస్టు 15లోగా రుణమాఫీ అంటున్నారని, తర్వాత జనవరి 26 అంటారని ఎద్దేవా చేశారు. 24ఏండ్ల నుంచి తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డితోఉన్నోళ్లే ఆయన సీటుకు ఎసరు పెట్టడం ఖాయమన్నారు. 5 ఏండ్లలో ఎంపీ బండి సంజయ్ పార్టీ కోసం పని చేశాడే తప్ప, ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు. ప్రజల మనోభావాలతో బండి సంజయ్ రాజకీయం చేస్తున్నాడని, గత ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేసి ప్రజలు ఇప్పుడు తిప్పలు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్, ఎంపీపీ మేకల స్వప్న, మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్, కేడీసీసీ డైరెక్టర్ శ్రీపతి రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, నాయకులు కడారి రాజు, తంగెడ మహేందర్, ఎల్తూరి స్వామి, మునిగడప శేషగిరి, గొల్లె మహేందర్ పాల్గొన్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు మార్పు అని కాంగ్రెస్ చెబితే నమ్మి ఓట్లేసిన జనం ఇప్పుడు బాధపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాదుల నీళ్లను నార్త్ కెనాల్ ద్వారా తీసుకొచ్చి చెరువులు నింపామని గుర్తు చేశారు. ఇప్పుడు నీళ్లు లేక పొలాలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.