స్టేషన్ ఘన్పూర్, జూన్ 23 : విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయ చేతకాని కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్పై నిరసన కార్యక్రమాలు చేపడుతోందని జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలో మండలపార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ను విమర్శిస్తే అధికారంలోకి రావచ్చని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోందన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినంత మాత్రాన తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని అనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అక్కడి పరిస్థితులు, ఇక్కడి పరిస్థితులు బేరీజు వేసుకుంటే అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసనలను తెలంగాణలో ఏ ఒక్క బిడ్డకూడా హర్షించడం లేదన్నారు. ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారని, తెలంగాణలో కాంగ్రెస్ మరో ఇరవై ఏైళ్లెనా కూడా అధికారంలోకి రాలేదని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పాలనలో తెలంగాణ అభివృద్ధిలో కుంటుపడిందన్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేసి సఫలీకృతుడు అయ్యాడని ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్లలో ఎవరూ ఊహించని రీతిలో, ప్రపంచ దేశాలు సైతం తెలంగాణ వైపు చూసేలా జరిగిన అభివృద్ధిని ప్రజలతో పంచుకోవడానికి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తే ప్రజాధనాన్ని కేసీఆర్ వృథా చేస్తున్నారనడం తెలంగాణపై వారికి ఉన్న ప్రేమను తేటతెల్లంచేసిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏ రంగంలో అభివృద్ధి చేసిందో చూపించాలన్నారు. ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఎందు కు లేవని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలలో కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయిందన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీయకుండా, పరోక్షంగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ తమ ఉనికిని చాటుకోవడానికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు, నిరసనలు చేపట్టడం సిగ్గు చేటన్నారు. తెలంగాణను మేం ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 1200మంది ఆత్మబలిదానాలకు వారే కారణమయ్యారన్నారు. ఎవరో ఇస్తే తెలంగాణ రాలేదని, తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకుంటే వచ్చిందన్నారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకోవడం చేతకాని కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా రాజకీయం చేయడం హేయమైన చర్య అన్నారు.
ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటున్న కేసీఆర్..
రైతు కుటుంబం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటూనే, అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారని సంపత్రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 2లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాడని, బీసీ కులాలకు రూ.లక్ష అందించడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, తెలంగాణ అమర వీరుల స్మారక స్మృతి జ్యోతిని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఒక్క కేసీఆర్కే సాధ్యమని, వీటి ఏర్పాటుతో ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని ఆయన అన్నారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాటికొండ సురేశ్కుమార్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మునిగల రాజు, మార్కెట్ వైస్ చైర్మన్ చందర్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ తోట సత్యం, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల నర్సింహారెడ్డి, చిల్పూరు మండల రైతు కో ఆర్డినేటర్ జనగాం యాదగిరి, ఎంపీటీసీలు గుర్రం రాజు, వెంకటస్వామి, బైరి బాలరాజు, గోవిందు అశోక్, మాతంగి దేవయ్య, గుర్రం ఫాతి కుమార్, చింత శ్రీను, మారపల్లి ప్రసాద్, గుండె మల్లేశ్, గాదె శ్రీను, గుర్రం కోర్నేల్ పాల్గొన్నారు.