జనగామ, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ)/స్టేషన్ఘన్పూర్/ చిల్పూరు : జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని స్వగృహంలో టీ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలారు. అప్రమత్తమైన ఆయన భార్య, వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ముందుండి పోరాడి, బీఆర్ఎస్లో వివిధ పదవులు చేపట్టి, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న ఆయన మృతితో పార్టీ శ్రేణుల్లో విషాదం అలుముకుంది. సంపత్రెడ్డి పార్థివదేహాన్ని స్వగ్రామం చిల్పూరు మండలంలోని రాజవరానికి తరలించగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి చేరుకొని నివాళులర్పించారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. నేడు అంత్యక్రియలు జరుగనుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలిసింది.
జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి(55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. జనగామ జిల్లా చిల్పూరు మండ లం రాజవరం గ్రామానికి చెందిన సంపత్రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడిగా బీఆర్ఎస్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమంలో, పార్టీలో ఆయన సేవలను గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జడ్పీచైర్మన్గా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పదవులను ఇచ్చారు. వివాదరహితుడిగా పేరుతెచ్చుకున్న సంపత్రెడ్డి హ ఠాన్మరణంతో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రగాఢ సంతాపం తెలిపి, ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కడియం శ్రీహరి గురువారం మధ్యాహ్నం స్టేషన్ఘన్పూర్లో తొలిసారి నిర్వహించి విలేకరుల సమావేశంలో అందరితో కలివిడిగా గడిపి, పార్టీ శ్రేణులతో సంబురాలు జరుపుకొని స్వయంగా స్వీట్లు పంచి ఉత్సాహంగా కనిపించిన సంపత్రెడ్డి కొద్దిసేపటికే కానరాని లోకాలకు వెళ్లడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి సోమవారం రాత్రి రాజవరం వెళ్లి పాగాల పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు టీ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంతాపం ప్రకటించి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ప్రమాదంలో తనయుడు.. గుండెపోటుతో తండ్రి
జయపాల్రెడ్డి-సుకన్య దంపతులకు ముగ్గురు సంతానంలో సంపత్రెడ్డి పెద్దవాడు. 1968 డిసెంబర్ 26న జన్మించిన ఆయన ప్రాథమిక విద్యను రాజవరంలో, 8, 9తరగతులను హనుమకొండలో, 10వ తరగతి, ఇంటర్ స్టేషన్ఘన్పూర్లో పూర్తిచేసి హైదరాబాద్లో బీకాం. హనుమకొండలో ఐటీఐ పూర్తి చేశారు. 1992లో సుజాతారెడ్డితో వివాహం కాగా కుమారుడు సాయిరెడ్డి, కుమార్తె సంజనారెడ్డి జన్మించారు. సంజనారెడ్డి ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. కాగా, 2010 జూన్ 26న కుమారుడు సాయిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో సంపత్రెడ్డి మానసికంగా కుంగిపోయాడు.
అంతక్రియలకు హాజరుకానున్న కేటీఆర్
పాగాల అంత్యక్రియలను రాజవరంలోని వ్యవసాయం క్షేత్రంలో నేడు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి..
పాగాల మృతి విషయం తెలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంపత్రెడ్డి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసాన్చిరు.
కేసీఆరే దైవంగా..
తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ అంటే పాగాలకు దైవంతో సమానం. ఆదివారం ఎన్నికల ఫలితాలను జనగామ పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి ఇంట్లో చాలాసేపు టీవీలో చూస్తూ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం లేదని ఉద్వేగానికి గురయ్యాడని చెబుతున్నారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ పిలుపుతో సూపర్వైజర్ ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమంలోకి అడుగుపెట్టిన పాగాల, ఇటుకబట్టీల వ్యాపారం చేసి వచ్చిన డబ్బుతో ఉద్యమానికి ఊతమిచ్చారు. లాఠీ దెబ్బలు తినడమే కాకుండా నిర్బంధాన్ని తట్టుకొని నిలిచాడు. ఉద్యమ సమయంలో పాగాలపై 28 కేసులు నమోదయ్యాయి. 2001లో కరీంనగర్ జైత్రయాత్ర సభలో టీఆర్ఎస్లో చేరిన సంపత్రెడ్డి 2002 నుంచి 2006 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగం ప్రచార ప్రధాన కార్యదర్శిగా, 2006 నుంచి 2013 వరకు స్టేషన్ఘన్పూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, 2013 నుంచి 2015 వరకు స్టేషన్ఘనపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పలు పదవుల్లో పనిచేశారు. 2019 జూలై 5న చిల్పూరు మండల జడ్పీటీసీగా ఎన్నికైన సంపత్రెడ్డి సేవలను గుర్తించిన కేసీఆర్ ఆయనను జనగామ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపిక చేశారు. ఆ తర్వాత 2022 జనవరి 26న జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా నియమితుడయ్యారు.